ఐపీఎల్‌లో మరో విండీస్‌ ప్లేయర్‌

28 Mar, 2019 17:28 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో అలరించడానికి మరో వెస్టిండీస్‌ ఆటగాడు సిద్ధమయ్యాడు. ఇప్పటికే క్రిస్‌ గేల్‌, ఆండ్రీ రసెల్‌, డ్వేన్‌ బ్రేవో, పొలార్డ్‌ వంటి స్టార్‌ ఆటగాళ్లు తమ ప్రత్యేకతను చాటుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజా సీజన్‌లో విండీస్‌కే చెందిన పేసర్‌ అల్జర్రీ జోసెఫ్‌ ఆడబోతున్నాడు. అతను ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు ఐపీఎల్‌ యాజమాన్యం స్పష్టం చేసింది. ముంబై ఇండియన్స్‌ తరుఫున ఆడుతూ గాయం కారణంగా జట్టుకు దూరమైన న్యూజిలాండ్‌ క్రికెటర్‌ ఆడమ్‌ మిల్నే స్థానంలో అల్జర్రీ జోసెఫ్‌ను తీసుకున్నారు.ఈ మేరకు జోసెఫ్‌తో ముంబై ఇండియన్స్‌ ఒప్పందం కుదుర‍్చకుంది.

ఆడమ్‌ మిల్నే మడమ గాయంతో స్వదేశానికి పయనమైన నేపథ్యంలో అతనికి ప్రత్యామ్నాయంగా జోసెఫ్‌ ఆడటానికి అనుమతి ఇచ్చారు. ఈ సీజన్‌లో మిల్నే స్థానాన్ని జోసెఫ్‌ భర్తీ చేస్తాడని ఐపీఎల్‌ యాజమాన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. వెస్టిండీస్‌ తరఫున తొమ్మిది టెస్టులు, 16 వన్డేలు ఆడిన అనుభవం జోసెఫ్‌ది. కుడిచేత వాటం పేసర్‌ అయిన జోసెఫ్‌ 25 టెస్టు వికెట్లు, 24 వన్డే వికెట్లను సాధించాడు. ఇప్పటికే శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగా ముంబై ఇండియన్స్‌తో కలవగా, ఇప్పుడు జోసెఫ్‌ ఎంపిక ఆ జట్టు బౌలింగ్‌ విభాగం మరింత పటిష్టమైంది. ముంబై ఇండియన్స్‌ తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ చేతిలో పరాజయం చవిచూసింది.

మరిన్ని వార్తలు