ఉత్కంఠ పోరులో ముంబైదే విజయం

17 May, 2018 00:21 IST|Sakshi
బుమ్రా

రోహిత్‌ సేన ప్లే ఆఫ్‌ ఆశలు సజీవం

రాహల్‌ పోరాటం వృథా

రాణించిన బుమ్రా

ముంబై : కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ముంబై ఇండియన్స్‌నే విజయం వరించింది. చివర్లో ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 187 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ ఛేదించలేకపోయింది. కేఎల్‌ రాహుల్‌ (94: 60 బంతులు,10 ఫోర్లు,3 సిక్స్‌లు), ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) లు దాటిగా ఆడినా చివర్లో బ్యాట్స్‌మెన్‌ ఒత్తిడికి చిత్తవ్వడంతో 3 పరుగుల తేడాతో ముంబై విజయాన్నందుకుంది. అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆండ్రూ టై(4/ 16) దాటికి కుదేలైంది. పోలార్డ్‌ (50: 23బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), కృనాల్‌(32: 23 బంతుల్లో,1 ఫోర్‌,1 సిక్స్‌),  సూర్యకుమార్‌ యాదవ్‌(27: 15 బంతుల్లో 3 ఫోర్‌, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషాన్(20 : 12 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్స్‌లు‌)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు 8 వికెట్లు నష్టపోయి 186 పరుగులు చేసింది.

రాహుల్‌ వీరవిహారం..
187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కింగ్స్‌ పంజాబ్‌ ఓపెనర్లు ఇన్నింగ్స్‌ను దాటిగా ఆరంభించారు. అయితే క్రిస్‌ గేల్‌ (18: 11బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌) నిరాశ పరచగా.. మరో ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌ తనదైన శైలిలో రెచ్చిపోయాడు. ఈ సీజన్‌లో దూకుడు మీదున్న రాహుల్‌ క్రీజులోకి వచ్చిన ఫించ్‌తో దాటిగా ఆడాడు. ఈ క్రమంలో 36 బంతుల్లో  4 ఫోర్లు,1 సిక్స్‌తో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరోవైపు ఫించ్‌ సైతం దాటిగా ఆడాడు. దీంతో పంజాబ్‌ 12.1 ఓవర్లలోనే 100 పరుగులు పూర్తి చేసింది. బుమ్రా వేసిన 17 ఓవర్‌లో ఫించ్‌(46: 35 బంతులు, 3 ఫోర్లు,1 సిక్స్‌) భారీ షాట్‌కు ప్రయత్నించి తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకున్నాడు. దీంతో రెండో వికెట్‌కు నమోదైన 111 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన స్టోయినిస్‌ (1) తీవ్రంగా నిరాశపరిచాడు.

మ్యాచ్‌ను తిప్పేసిన బుమ్రా
పంజాబ్‌ విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సి ఉండగా బుమ్రా పంజాబ్‌ విజయాన్ని లాగేశాడు. అద్భుత బంతితో రాహుల్‌ (94: 60 బంతులు,10 ఫోర్లు,3సిక్స్‌లు)ను బోల్తా కొట్టించిన బుమ్రా ఈ ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు . చివరి ఓవర్లో పంజాబ్‌ విజయానికి కావాల్సిన 17 పరుగులను చేయడంలో యువరాజ్‌ సింగ్‌, అ‍క్షర్‌  పటేల్‌లు విఫలమవ్వడంతో పంజాబ్‌ ఓటమిని చవిచూసింది. మెక్లీగన్‌ వేసిన ఈ ఓవర్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి వెనుదిరగగా.. ఆవెంటనే అ‍క్షర్‌ సిక్స్‌ బాది పంజాబ్‌ శిభిరంలో ఆశలు రేపాడు కానీ తరువాత పరుగులు రాబట్టడంతో విఫలమవ్వడంతో బంతి మిగిలి ఉండగానే ముంబై విజయం లాంఛనమైంది. ముంబై బౌలర్లలో బుమ్రా మూడు, మెక్లిగన్‌ రెండు వికెట్లు తీశారు.

మరిన్ని వార్తలు