ముంబైకి కళింగ లాన్సర్స్‌ షాక్‌

1 Feb, 2017 00:18 IST|Sakshi
ముంబైకి కళింగ లాన్సర్స్‌ షాక్‌

ముంబై: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌)లో వరుస విజయాలతో జోరు మీదున్న దబంగ్‌ ముంబై  జట్టుకు తొలి పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కళింగ లాన్సర్స్‌ జట్టు 4–3 గోల్స్‌ తేడాతో ముంబై జట్టును బోల్తా కొట్టించింది. కళింగ లాన్సర్స్‌ తరఫున ఫ్యుర్‌స్టె మోరిట్జ్‌ రెండు పెనాల్టీ కార్నర్‌ల ద్వారా రెండు గోల్స్‌ (32వ 33వ ని.లో) చేయగా... బాకెర్‌ బిల్లీ (40వ ని.లో) ఫీల్డ్‌ గోల్‌ సాధించాడు. హెచ్‌ఐఎల్‌లో ఒక ఫీల్డ్‌ గోల్, పెనాల్టీ స్ట్రోక్‌ రెండు గోల్స్‌తో సమానం. అంతకుముందు ముంబై తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 27వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్‌గా మలిచాడు.

దాంతో ముంబై 2–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. 43వ నిమిషంలో హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ కార్నర్‌ను లక్ష్యానికి చేర్చడంతో ముంబై ఖాతాలో మరో గోల్‌ చేరింది. ఆ తర్వాత ముంబై మరో గోల్‌ చేసేందుకు ప్రయత్నించినా లాన్సర్స్‌ అడ్డుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. బుధవారం జరిగే మ్యాచ్‌లో పంజాబ్‌ వారియర్స్‌తో రాంచీ రేస్‌ తలపడుతుంది.

 

మరిన్ని వార్తలు