మెరిసిన పొలార్డ్‌

6 Apr, 2019 21:51 IST|Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ 137 పరుగుల టార్గెట్‌ నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లలో పొలార్డ్‌(46 నాటౌట్‌) మినహా ఎవరూ రాణించకపోవడంతో ముంబై ఇండియన్స్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. రోహిత్‌ శర్మ(11) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరగా,సూర్యకుమార్‌ యాదవ్‌(7) రెండో వికెట్‌గా ఔటయ్యాడు.ఆపై కాసేపటికి కుదురుగా ఆడుతున్నట్లు కనిపించిన డీకాక్‌(19) సైతం పెవిలియన్‌ చేరాడు.

ఇక అటు తర్వాత కృనాల్‌ పాండ్యా(6), ఇషాన్‌ కిషన్‌(17), హార్దిక్‌ పాండ్యా(14), రాహుల్‌ చాహర్‌(10)లు లు స్వల్ప వ్యవధిలో ఔట్‌ కావడంతో ముంబై 97 పరుగులకే ఏడు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తరుణంలో పొలార్డ్‌ బ్యాట్‌ ఝుళిపించాడు. 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు సాయంతో అజేయంగా 46 పరుగులు సాధించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 136 పరుగులు చేసింది. సిద్థార్ధ్‌ కౌల్‌ రెండు వికెట్లు సాధించగా, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, నబీ, రషీద్‌ ఖాన్‌లు తలో వికెట్‌ తీశారు.

మరిన్ని వార్తలు