ఆ క్రికెటర్‌పై డీకే అభిమానుల ఆగ్రహం

20 Mar, 2018 09:13 IST|Sakshi
దినేశ్‌ కార్తిక్‌, మురళీ విజయ్‌(ఇన్‌సెట్లో)

సాక్షి, స్పోర్ట్స్‌ : నిదహాస్‌ ట్రోఫీ ఫైనల్‌ మ్యాచ్‌లో అద్బుత ప్రదర్శనతో జట్టుకు విజయం అందించిన దినేశ్‌ కార్తిక్‌కు అభిమానులతో పాటు, సహచర ఆటగాళ్లు, సీనియర్లు ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నారు. దీంతో డీకే అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. కానీ వారికి ఇప్పుడు కోపం వచ్చింది. ఎందుకంటే దేశమంతా డీకేను కొనియాడుతుంటే ఒక క్రికెటర్‌ మాత్రం జట్టును మాత్రమే పొగిడి కనీసం డీకే పేరును ప్రస్తావించకపోవడంతో ట్విటర్‌ వేదికగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

డీకే సహచర ఆటగాడు, ఒకప్పటి స్నేహితుడు మురళీ విజయ్‌ భారత విజయాన్ని అభినందిస్తూ ‘ఇదొక గొప్ప విజయం.. భారత క్రికెట్‌ బ్రాండ్‌ విలువను పెంచేందుకు బీసీసీఐ చేస్తున్న కృషికి ఇది నిదర్శనం’ అంటూ ట్వీట్‌ చేశాడు. జట్టు విజయానికి కారణమైన కార్తిక్‌ పేరును ఎక్కడా ప్రస్తావించకపోవడంతో డీకే అభిమానులు మురళీ విజయ్‌కు కౌంటర్‌గా ట్వీట్ల ద్వారానే సమాధానం ఇస్తున్నారు.

‘విజయ్‌ నీకు ఇదేమీ కొత్త కాదు.. ఇంతకు ముందు తమిళనాడు జట్టు విజయ్‌ హజారే ట్రోఫీ గెలుపులో ప్రధాన పాత్ర పోషించిన డీకేని విస్మరించావు. నువ్వింకా ఎదగాలి’ అంటూ ఓ అభిమాని ట్వీట్‌ చేయగా.. ‘మీ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి.. నిజాయితీగా స్పందించడం నేర్చుకో’ అని మరొకరు సలహా ఇచ్చారు.

కాగా భారత క్రికెటర్‌ రవీంద్ర జడేజా కూడా.. ‘డీకే పేరును ప్రస్తావించక పోవడానికి ఉన్న స్పష్టమైన కారణాలేంటో’ అంటూ ట్వీట్‌ చేశాడు.

ఒకప్పుడు మంచి స్నేహితులుగా ఉన్న ఈ తమిళనాడు ఆటగాళ్లు... దినేశ్‌ కార్తిక్‌ మాజీ భార్య నిఖిత.. మురళీ విజయ్‌ను పెళ్లాడినప్పటి నుంచి దూరమయ్యారు. కాగా 2015లో దినేశ్‌ కార్తిక్‌ స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పళ్లికల్‌ను పెళ్లి చేసుకున్నాడు.

మరిన్ని వార్తలు