తండ్రీకొడుకుల తడాఖా

19 Feb, 2018 10:20 IST|Sakshi

టాప్‌ సీడ్‌ జంటకు షాకిచ్చిన కేవీఎన్‌ మూర్తి–పరేశ్‌

ఐటీఎల్‌ డబుల్స్‌ టైటిల్‌ కైవసం

సాక్షి, హైదరాబాద్‌: ఇండియా టెన్నిస్‌ లీగ్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన తండ్రీకొడుకులు సత్తా చాటారు. వీరిద్దరూ జంటగా బరిలోకి దిగి డబుల్స్‌ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. కుత్బుల్లాపూర్‌లోని కల్లూర్‌ టెన్నిస్‌ అకాడమీలో జరిగిన పురుషుల డబుల్స్‌ ఫైనల్లో కేవీఎన్‌ మూర్తి–కె. పరేశ్‌ జంట టాప్‌ సీడ్‌ సూర్య పవన్‌–ఎర్రన్‌ సాయి జోడీపై గెలుపొంది విజేతగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయి టోర్నీల్లో 35+, 45+ వయో విభాగంలో సత్తా చాటుతోన్న కేవీఎన్‌ మూర్తి 30 ఏళ్ల వయస్సులో ఆటవిడుపుగా టెన్నిస్‌పై మక్కువ పెంచుకున్నాడు.

తర్వాత ఈ క్రీడలో రాణిస్తూ 2017లో జరిగిన నేపాల్‌ ఐటీఎఫ్‌ సీనియర్‌ (45+) చాంపియన్‌ షిప్‌లో డబుల్స్‌ విజేతగా నిలవడంతో పాటు, సింగిల్స్‌ రన్నరప్‌ టైటిల్‌ను సాధించాడు.  థాయ్‌లాండ్‌లో జరిగిన పట్టాయా టెన్నిస్‌ సీనియర్‌ సిరీస్‌లోనూ డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. ఇవే కాకుండా పలు ఐటా సీనియర్‌ ర్యాంకింగ్‌ టోర్నీల్లో పతకాలను సాధించాడు.   

 

మరిన్ని వార్తలు