'పాకిస్తాన్‌లో క్రికెట్‌ కంటే నాకు ప్రాణం ముఖ్యం'

19 Jan, 2020 10:39 IST|Sakshi

పాకిస్తాన్‌లో క్రికెట్ ఆడటం కన్నా తనకు తన ప్రాణాలు ముఖ్యం అంటూ క్రికెటర్ ముష్ఫికర్ రహీమ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు లేఖ రాశాడు. దీంతో అతని లేఖ క్రికెట్ వర్గాల్లో కలకలం రేపుతోంది. పాకిస్తాన్‌లో శ్రీలంక క్రికెట‌ర్లపై దాడి త‌రువాత ఆ దేశంలో ప‌ర్య‌టించేందుకు ఏ జ‌ట్టు ముందుకు రావ‌డం లేదు. ఆ ఘ‌ట‌న జ‌రిగి 10 ఏళ్లు కావ‌స్తున్నా భ‌ద్ర‌తా ప‌ర‌మైన కార‌ణాలు చూపుతూ ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించడం లేదు. దీంతో త‌మ దేశంలో జ‌ర‌గాల్సిన మ్యాచుల‌ను ఇప్ప‌టి వ‌ర‌కు పాకిస్తాన్ త‌ట‌స్థ వేదిక‌లపై నిర్వహిస్తూ వ‌స్తోంది.

ఇటీవ‌ల శ్రీలంక జ‌ట్టు పాక్‌లో ప‌ర్య‌టించింది. అయితే ఆ ప‌ర్య‌ట‌నకు శ్రీలంక సీనియ‌ర్ క్రికెట‌ర్లు దూరంగా ఉండ‌డంతో జూనియ‌ర్ జ‌ట్టునే పాక్‌కు పంపించింది. జనవరి 14 నుంచి మూడు టీ20లు, ఒక వన్డే, రెండు టెస్టుల సిరీస్‌ని పాకిస్తాన్‌లో బంగ్లా, పాక్‌ జట్లు ఆడేలా షెడ్యూల్‌ రూపొందించారు. అయితే తాజాగా ముష్ఫికర్ తీసుకున్న నిర్ణయంతో అతని దారిలోనే మరికొంతమంది క్రికెటర్లు పయనించే అవకాశం ఉంది. ముష్ఫికర్ రహీమ్ మరో అడుగు కూడా ముందుకేసి బీసీబీ(బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు)కి లేఖ రాసి మరీ తాను వెళ్లడం కుదరదని స్పష్టం చేశారు. 

చదవండి: నువ్వు లేకుండా క్రికెట్‌ ఎలా ఆడాలి?

'పాకిస్తాన్‌లో భద్రతపై మా ఫ్యామిలీ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అందుకే నేను పాక్ పర్యటనకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నా. గతంలో కంటే పాక్‌లో ప్రస్తుతం పరిస్థితి మెరుగ్గానే ఉంది. కానీ.. క్రికెట్‌ కంటే జీవితం ముఖ్యం కదా..? పాక్‌లో పిచ్‌లు బ్యాటింగ్‌కి బాగా అనుకూలిస్తుంటాయి. సిరీస్‌ జరుగుతుంటే.. ఇంట్లో కూర్చోవడం కష్టమే. కానీ.. తప్పట్లేదు' అని ర‌హీమ్ ఆలేఖ‌లో పేర్కొన్నాడు. ఇక ర‌హీమ్ బాట‌లోనే మ‌రికొంతమంది క్రికెట‌ర్లు న‌డిచే అవ‌కాశం ఉంది. 

చదవండి: సచిన్‌, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్‌..

గతంలో శ్రీలంక క్రికెటర్లు ప్రయాణిస్తున్న బస్సుపై పాక్‌లో ఉగ్రదాడి జరిగింది. అప్పుడు ఆ జట్టులోని చాలా మంది క్రికెటర్లకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆ ఘటన తర్వాత ఏ క్రికెట్ జట్టు కూడా పాక్ గడ్డపై పర్యటించేందుకు ఆసక్తి కనబర్చడం లేదు. గత ఏడాది చివర్లో మళ్లీ శ్రీలంక జట్టు పాక్‌లో పర్యటించింది. అయినా బంగ్లాదేశ్ క్రికెటర్లు మాత్రం వెనుకంజ వేస్తున్నారు. దీంతో పాకిస్తాన్‌లో బంగ్లాదేశ్ ప‌ర్య‌టించ‌డం అనుమానంగా మారింది. బీసీబీ పాకిస్థాన్ సిరీస్‌పై పున‌రాలోచ‌న‌లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు