ముష్ఫికర్‌ ‘డబుల్‌’ చరిత్ర

24 Feb, 2020 20:48 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆటగాడు ముష్ఫికర్‌ రహీమ్‌ మరోసారి అరుదైన ఫీట్‌ను సాధించాడు. జింబాబ్వేతో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్‌లో ముష్ఫికర్‌ రహీమ్‌ మరోసారి డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. మూడో రోజు ఆటలో రహీమ్‌ డబుల్‌ సెంచరీ మార్కును అందుకున్నాడు. దాంతో తన టెస్టు కెరీర్‌లో మూడో ద్విశతకం సాధించి ఆ దేశం తరఫున అత్యధికసార్లు డబుల్‌ సెంచరీలు సాధించిన ఘనతను సవరించుకున్నాడు. ఇప్పటివరకూ బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో అత్యధిక డబుల్‌ సెంచరీ చేసిన వారిలో ముష్ఫికరే ముందుండగా మరోసారి ఆ మార్కును సాధించి తన రికార్డును మెరుగుపరుచుకున్నాడు.

బంగ్లాదేశ్‌ తరఫున టెస్టుల్లో డబుల్‌ సెంచరీలు సాధించిన వారిలో తమీమ్‌ ఇక్బాల్‌, షకీబుల్‌ హసన్‌లు తలో ఒకసారి మాత్రమే ద్విశతకాలు సాధించగా, ముష్ఫికర్‌ మూడో డబుల్‌ సెంచరీని సాధించడం విశేషం. జింబాబ్వేతో టెస్టులో ముష్ఫికర్‌( 203 నాటౌట్‌) డబుల్‌ సెంచరీ పూర్తయిన తర్వాత బంగ్లాదేశ్‌ తన ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్‌ చేసింది. బంగ్లాదేశ్‌ మొదటి ఇన్నింగ్స్‌ స్కోరు 560/6 వద్ద ఉండగా డిక్లేర్డ్‌ చేసింది. దాంతో బంగ్లాకు 295 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. ముష్పికర్‌కు జతగా కెప్టెన్‌ మోమినుల్‌ హక్‌(132) సెంచరీ సాధించాడు. 

మళ్లీ వారిదే అత్యధికం..
టెస్టుల్లో నాల్గో వికెట్‌కు ముష్పికర్‌-మోమినుల్‌లు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దాంతో నాల్గో  వికెట్‌కు రెండోసారి అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని ఈజోడి సాధించినట్లయ్యింది. 2018లో జింబాబ్వేపైనే వీరిద్దరూ  266 పరుగుల భాగస్వామ్యాన్ని నాల్గో వికెట్‌కు సాధించగా, ఇప్పుడు మరొకసారి రెండొందలకు పైగా పరుగుల్ని అదే జట్టుపై సాధించారు. ఇక బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత టెస్టు స్కోరు కూడా ముష్పికర్‌ పేరిటే ఉంది. 2018లో జింబాబ్వేపై ముష్ఫికర్‌ అజేయంగా 219 పరుగులు సాధించాడు. ఇదే బంగ్లా తరఫున ఇప్పటికే అత్యధిక వ్యక్తిగత స్కోరుగా ఉంది. ఆ తర్వాత షకిబుల్‌ ఉన్నాడు. 2017లో షకిబుల్‌ 217 పరుగుల్ని న్యూజిలాండ్‌పై సాధించాడు. 

మరిన్ని వార్తలు