'మైదానంలో మురళీని అవమానించారు'

28 Dec, 2017 16:07 IST|Sakshi

మెల్‌బోర్న్‌: టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్‌ ముత్తయ్య మురళీ ధరన్‌. శ్రీలంకకు చెందిన మురళీ తన టెస్టు కెరీర్‌లో 800 వికెట్లు సాధించి ఇప్పటికీ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. అయితే మురళీ కెరీర్‌ను చాలాకాలం వెంటాడి నిద్రలేకుండా చేసింది మాత్రం అతని బౌలింగ్‌ యాక్షన్‌. ఎంతలా అంటే మురళీ మ్యాచ్‌ ఆడుతున్నాడంటే అతని బౌలింగ్‌ మాత్రమే చర్చ నడిచేంతగా.

ఒకానొక సందర్బంలో మురళీ మోచేతి(ఎల్బో)ని వంచే క్రమంలో అది నిబంధనలకు విరుద్దంగా ఉందంటూ అతని బౌలింగ్‌ను నిషేధించిన పని చేశాడు అంపైర్‌ హెయిర్‌. ఆస్ట్రేలియాతో ఎంసీజేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మురళీ బౌలింగ్‌ను తప్పుబడుతూ వరుస పెట్టి నో బాల్‌ ఇచ్చాడు. దాంతో మురళీ కెరీర్‌ అయోమయంలో పడింది. కాగా, లంక కెప్టెన్‌ అర్జున రణతుంగతో పాటు పలువురు వ్యాఖ్యాతలు సైతం మురళీ అండగా నిలవడంతో అతని బౌలింగ్‌ యాక్షన్‌ను సరిచేసుకునే అవకాశం దొరికింది. దానిలో భాగంగా ఐసీసీ నుంచి బౌలింగ్‌లో క్లీన్‌ సర్టిఫికెట్‌ తెచ్చుకుని ఆపై అత్యధిక టెస్టు వికెట్లను తన పేరిట లిఖించుకున్న క్రికెటర్‌ మురళీ.

కాగా, తాజాగా మురళీ బౌలింగ్‌ యాక్షన్‌పై తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు స్టీవ్‌ వా స్పందించాడు. 'మురళీ బౌలింగ్‌ కు శిలువ వేసేంత పని చేశారు. అతన్ని మైదానంలో చాలా దారుణంగా అవమానించారు. నా వరకూ అయితే ఒక ఆటగాడికి దక్కే గౌరవం మురళీకి దక్కలేదు.  టెస్టు మ్యాచ్‌కు ముందు ఎప్పుడూ మురళీ గురించే చర్చ. మురళీ బౌలింగ్‌ చేసేటప్పుడు మోచేతిలో వంపు రావడానికి కారణం అతని శారీరక స్థితే. అతను అలా పుట్టాడు కాబట్టే బౌలింగ్‌ యాక్షన్‌ అలా ఉండేది. మురళీ శైలిలో వేరేవారు బౌలింగ్‌ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ మురళీ కావాలని బౌలింగ్‌ను అలా చేస్తే చాలా మంది అతన్ని కాపీ కొట్టేవారు కాదా. ఆ బౌలింగ్‌ యాక్షన్‌ను ఇప్పటివరకూ ఎవరూ అనుకరించలేదంటే మురళీ బౌలింగ్‌ విభిన్నమైదని లెక్క. నా దృష్టిలో మురళీ బౌలింగ్‌ కచ్చితంగా ప్రత్యేకమైనదే' అని స్టీవ్‌ తెలిపాడు.
 

>
మరిన్ని వార్తలు