టాప్‌–30లో చోటే లక్ష్యం: కశ్యప్‌

26 Feb, 2018 10:36 IST|Sakshi

న్యూఢిల్లీ: మూడేళ్ల అనంతరం అంతర్జాతీయ టైటిల్‌ సాధించిన భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పారుపల్లి కశ్యప్‌ తన జోరు కొనసాగిస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆస్ట్రియా ఓపెన్‌ టోర్నీ చేజిక్కించుకున్న అతను మాట్లాడుతూ... ‘చాలా రోజుల తర్వాత ట్రోఫీ నెగ్గడం ఆనందంగా ఉంది. ఈ విజయం వెనుక కోచ్‌ గోపీచంద్, శిక్షణ సిబ్బంది కృషి ఎంతో ఉంది. ఈ విజయాలను ఇలాగే కొనసాగిస్తూ... టాప్‌–30లో చోటు సంపాదించడమే నా లక్ష్యం’ అని ఈ హైదరాబాద్‌ ప్లేయర్‌ తెలిపాడు.

ప్రపంచ 44వ ర్యాంక్‌ లో ఉన్న కశ్యప్‌ ఏప్రిల్‌లో జరిగే కామన్వెల్త్‌ గేమ్స్‌కు అర్హత సాధించలేదు. దీనిపై అతను స్పందిస్తూ.. ‘గత ఏడాది కాలంగా శ్రీకాంత్, ప్రణయ్‌ అద్భుతంగా రాణిస్తున్నారు. వారు కామన్వెల్త్‌ గేమ్స్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి అర్హులు. వారు పతకాలతో తిరిగొస్తారని భావిస్తున్నాను’ అని తెలిపాడు.

మరిన్ని వార్తలు