లక్ష్యం టాప్‌–50

26 Jan, 2019 10:07 IST|Sakshi

టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌

కోల్‌కతా: స్వదేశంలో వచ్చే వారం ఇటలీతో జరుగనున్న డేవిస్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో రాణిస్తానని అంటున్నాడు టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్‌. గ్రాస్‌ కోర్టులపై తాను మెరుగైన ఆటగాడినని పేర్కొంటూ, ఇటీవల గ్రాస్‌ కోర్టుపై ప్రపంచ 23వ ర్యాంకర్‌ డెనిస్‌ షపలొవ్‌ (కెనడా)ను ఓడించిన విషయాన్ని గుర్తు చేశాడు. మోకాలి గాయంతో గతేడాది ఫ్రెంచ్‌ ఓపెన్‌కు దూరమైన ప్రజ్నేశ్‌... దాన్నుంచి కోలుకుని ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ బరిలో దిగి గ్రాండ్‌స్లామ్‌ అరంగేట్రం చేశాడు.

అయితే, తొలి రౌండ్‌లోనే 6–7 (7/9), 3–6, 3–6తో ఫ్రాన్సెస్‌ టియాఫొ (అమెరికా) చేతిలో పరాజయం పాలయ్యాడు. వచ్చే సారి మెయిన్‌ డ్రాకు అర్హత సాధిస్తే మరింత మెరుగైన ప్రదర్శన చేస్తానని చెప్పాడు. ప్రస్తుతం కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకు 104లో ఉన్న ప్రజ్నేశ్, తన  లక్ష్యం టాప్‌–50లోకి చేరుకోవడమేనని వివరించాడు. ఇందులోభాగంగా ముందుగా టాప్‌–100లోకి రావడంపై దృష్టిపెట్టానన్నాడు.   

మరిన్ని వార్తలు