రాహుల్‌ భర్తీ చేశాడు.. కానీ నా క్లాస్‌ శాశ్వతం!

24 Dec, 2019 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: తన క్లాస్‌ శాశ్వతం అంటున్నాడు టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌. వచ్చే ఏడాది శ్రీలంక, ఆసీస్‌లతో సిరీస్‌ల్లో భాగంగా భారత జట్టులో చోటు దక్కించుకున్న శిఖర్‌ ధావన్‌.. కొత్త సంవత్సరాన్ని తాజాగా ఆరంభిస్తానని అన్నాడు. ఈ క‍్రమంలోనే తన క్లాస్‌ శాశ్వతం అంటూ చెప్పుకొచ్చాడు. ఈ ఏడాది తాను వేలి గాయంతో పాటు మెడ కండరాల నొప్పితో కంటి గాయంతో కూడా బాధ పడ్డానన్నాడు. ఇవన్నీ తన ఆటపై ఏమాత‍్రం ప్రభావం చూపలేవని ధావన్‌ తెలిపాడు. ‘ శ్రీలంక-ఆసీస్‌ల సిరీస్‌లకు ఎంపిక కావడం సంతోషం కాదన్నాడు. ‘ ఇది నాకు కొత్త ఆరంభం.  

ఈ ఏడాది అంతా వేలి గాయంతో పాటు కంటి గాయం, మోకాలి గాయం, మెడ నొప్పితో బాధ పడ్డా. దాంతో పలు సిరీస్‌లకు దూరమయ్యా. కానీ నేను లేని లోటును కేఎల్‌ రాహుల్‌ భర్తీ చేశాడు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకున్నాడు. ఇది ఒక శుభపరిణామం. కొత్త ఏడాదిలో నేను సత్తాచాటడంపైనే దృష్టి పెట్టా. గాయాలనేవి సహజంగానే అవుతూ ఉంటాయి. వాటిని కూడా స్వీకరించాలి. ప్రస్తుతం నేను బాగానే ఉన్నా. పెద్దగా ఆందోళన చెందడానికి ఏమీ లేదు. ఆడటం-ఆపేయడం చేస్తూ ఉన్నా. ఇది నా ఆటపై ప్రభావం చూపదు. నేను నా ఆటను మరిచిపోలేదు. క్లాస్‌ అనేది శాశ్వతం. నేను పరుగులు సాధిస్తా’ అని ధావన్‌ పేర్కొన్నాడు. గాయం కారణంగా విండీస్‌తో సిరీస్‌లకు దూరంగా ఉన్న శిఖర్‌ ధావన్‌.. ఇప్పుడు ఫిట్‌నెస్‌ నిరూపించుకుని మళ్లీ జట్టులోకి వచ్చాడు.  అయితే ఇప్పుడు రంజీ ట్రోఫీలో భాగంగా హైదరాబాద్‌తో జరుగనున్న మ్యాచ్‌కు ఢిల్లీ తరఫున ధావన​ ఆడటానికి సిద్ధమయ్యాడు.

>
మరిన్ని వార్తలు