'నా తదుపరి టార్గెట్ అదే'

30 Nov, 2015 16:14 IST|Sakshi
'నా తదుపరి టార్గెట్ అదే'

న్యూఢిల్లీ:ఇటీవల జరిగిన డెన్మార్క్ సూపర్ సిరీస్ లో ఫైనల్ కు చేరడమే కాకుండా, తాజాగా మాకావు గ్రాండ్ ప్రి గోల్డ్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకుని మంచి ఊపు మీద ఉన్న తెలుగు తేజం పివి సింధు మరో టైటిల్ వేటకు సన్నద్ధమవుతోంది. డిసెంబర్ 1 వ తేదీ నుంచి  ఆరంభం కానున్న ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి గోల్డ్ టోర్నమెంట్ లో కూడా తన జైత్రయాత్రను కొనసాగిస్తానని సింధు ధీమా వ్యక్తం చేస్తోంది. ' మకావు ఓపెన్ టైటిల్ వరుసగా మూడు సార్లు (2013,14,15) గెలవడం ఆనందంగా ఉంది. నిజంగా మరోసారి మకావు ఓపెన్ గెలవడం చాలా గొప్పగా ఉంది. నా తదుపరి టార్గెట్ ఇండోనేషియా మాస్టర్స్ గ్రాండ్ ప్రి' అని సింధు పేర్కొంది.

 

నిన్న జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్స్ లో జపాన్ కు చెందిన ఆరో ర్యాంకు క్రీడాకారిణి మినత్సు మితానిని సింధు మట్టికరిపించిన సంగతి తెలిసిందే. 66 నిమిషాలు పాటు సాగిన మ్యాచ్ లో  సింధు 21- 9, 21- 23, 21- 14 తేడాతో మితానిని ఓడించింది.ఇదిలా ఉండగా, మకావు టైటిల్ ను సాధించిన సింధుకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్) రూ.10లక్షల నజరానా ప్రకటించింది. తమ అంచనాలను అందుకున్నసింధు భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తుందని బాయ్ అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు