అయ్యర్‌, పంత్‌లకు అవకాశం దొరికింది: కోహ్లి

16 Dec, 2019 10:20 IST|Sakshi

చెన్నై: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. తాము నిర్దేశించిన 288 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడంలో విరాట్‌ గ్యాంగ్‌ విఫలమైంది. ఆ లక్ష్యాన్ని విండీస్‌ కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించి ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయానికి విండీస్‌ అన్ని విధాల తగినదని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పేర్కొన్నాడు. పిచ్‌ అప్పటికప్పుడు మారిపోయి వారికి అనుకూలించిందనడం సరైనది కాదన్నాడు. ఇక్కడ విండీస్‌ బ్యాటింగ్‌ అద్భుతంగా ఉండటంతోనే తాము ఓటమిని చవిచూడాల్సి వచ్చిందన్నాడు.

ఆదివారం మ్యాచ్‌ ముగిసిన తర్వాత అవార్డుల కార్యక్రమంలో మాట్లాడిన కోహ్లి.. ‘విండీస్‌ బ్యాటింగ్‌ చాలా బాగా ఆకట్టుకుంది. వారు పరిస్థితులకు తగ్గట్టు బ్యాటింగ్‌ చేశారు. ఈ విజయానికి వారికి అన్ని  విధాల అర్హత ఉంది. పిచ్‌లో మార్పు చోటు చేసుకోవడం వల్ల మేము ఓడిపోలేదు. వాళ్ల బ‍్యాటింగ్‌ ఆద్యంతం బాగా సాగడంతోనే ఓటమి పాలయ్యాం. ప్రత్యేకంగా మా స్పిన్నర్లపై వారు ఒత్తిడి తీసుకొచ్చి పైచేయి సాధించారు. ప్రధానంగా హెట్‌మెయిర్‌ ఇన్నింగ్స్‌ చిరస్మరణీయం. మేము ఇంకా 15-20 పరుగుల మధ్యలో చేయాల్సింది. నేను-రోహిత్‌ పూర్తిగా విఫలమయ్యాం.. కానీ మేము క్లిక్‌ కాలేకపోవడం వల్ల అది యువ క్రికెటర్లు అయిన శ్రేయస్‌ అయ్యర్‌-రిషభ్‌ పంత్‌లు రాణించడానికి అవకాశం దొరికిందనే చెప్పాలి. అయ్యర్‌-పంత్‌లు ఆకట్టుకోవడం మంచి పరిణామం. ఓవరాల్‌గా ఆరు బౌలింగ్‌ ఆప్షన్లు సరిపోతాయనే అనుకున్నాం’ అని కోహ్లి తెలిపాడు.

ఇక్కడ చదవండి:

సెంచరీలతో షాక్‌ ఇచ్చారు

హెట్‌మెయిర్‌ సరికొత్త రికార్డు

జడేజా రనౌట్‌పై వివాదం.. కోహ్లినే వచ్చేశాడు!

మరిన్ని వార్తలు