సాక్షి, హైదరాబాద్: వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పీవీ సింధును అన్ని రంగాల ప్రముఖులు అభినందిస్తున్నారు. బ్యాడ్మింటన్లో ప్రపంచ చాంపియన్గా నిలిచిన తొలి భారత క్రీడాకారిణిగా సింధు రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు పలువురు ప్రముఖులు నజరానాలు ప్రకటిస్తున్నారు.
తాజాగా మాజీ క్రికెటర్, హైదరాబాద్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు చాముండేశ్వరినాథ్ సింధుకు ఖరీదైన బీఎండబ్ల్యూ కారును బహూకరించారు. శవివారం మధ్యాహ్నం జరిగిన ఈ కార్యక్రమంలో సినీ హీరో అక్కినేని నాగార్జున చేతుల మీదుగా పీవీ సింధుకు కారును బహుమతిగా అందజేశారు. ప్రస్తుతం దీనికి సంబంధిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. గతంలో 2016లో జరిగిన రియో ఒలింపిక్స్ లో రజతం గెలిచిన సందర్బంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కూడా సింధుకు ఖరీదైన కారును బహుకరించిన విషయం తెలిసిందే.