దబంగ్‌ ఢిల్లీ టీటీసీ జట్టులో నైనా జైస్వాల్‌

14 Jun, 2019 13:59 IST|Sakshi

ముంబై: అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ (యూటీటీ) లీగ్‌ మూడో సీజన్‌కు రంగం సిద్ధమైంది. న్యూఢిల్లీ వేదికగా జూలై 25 నుంచి జరుగనున్న ఈ లీగ్‌లో పాల్గొనే జట్లను గురువారం ప్రకటించారు. ఇందులో భాగంగా దబంగ్‌ ఢిల్లీ టేబుల్‌ టెన్నిస్‌ క్లబ్‌ (టీటీసీ) జట్టుకు హైదరాబాద్‌ ప్లేయర్‌ నైనా జైస్వాల్‌ ప్రాతినిధ్యం వహించ నుంది. నైనాతో పాటు ఈ జట్టులో భారత స్టార్‌ ప్లేయర్‌ సత్యన్‌ జ్ఞానశేఖరన్, బెర్నాడెట్‌ జాక్స్, జాన్‌ పెర్సన్, పార్థ్‌ విర్మానీ, క్రిత్విక సిన్హా రాయ్‌ చోటు దక్కించుకున్నారు. భారత మహిళా స్టార్‌ ప్లేయర్, కామన్వెల్త్‌ గేమ్స్‌ స్వర్ణ పతక విజేత మనికా బత్రా ఆర్పీ–ఎస్‌జీ మావెరిక్స్‌ కోల్‌కతా తరఫున బరిలో దిగనుంది. ఈ ఏడాదే లీగ్‌లో ప్రవేశించిన కొత్త జట్టు చెన్నై లయన్స్‌ తరఫున శరత్‌ కమల్‌ ఆడనున్నాడు. మొత్తం 6 జట్లు ఈ లీగ్‌లో తలపడనుండగా... ఒక్కో జట్టులో ఆరుగురు చొప్పున ప్లేయర్లు ఉన్నారు. మరోవైపు అల్టిమేట్‌ టేబుల్‌ టెన్నిస్‌ లీగ్‌ ఫార్మాట్‌లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. గతేడాది మాదిరిగా ఏడు మ్యాచ్‌లతో కాకుండా కేవలం ఐదు మ్యాచ్‌లతోనే టై నిర్వహించనున్నారు. ఈసారి మ్యాచ్‌లన్నీ న్యూఢిల్లీలోనే జరుగనున్నాయి. క్రితం సారి మూడు నగరాల్లో యూటీటీ జరిగింది.  

జట్ల వివరాలు  
చెన్నై లయన్స్‌: శరత్‌ కమల్, పెట్రిస్సా సోల్జా, టియాజో అపొలోనియా, మధురికా పట్కర్, యశినీ శివశంకర్, అనిర్బన్‌ ఘోష్‌.
దబంగ్‌ ఢిల్లీ టీటీసీ: సత్యన్‌ జ్ఞానశేఖరన్, బెర్నడెట్‌ జాక్స్, జాన్‌ పెర్సన్, పార్థ్‌ విర్మానీ, నైనా జైస్వాల్, క్రిత్విక సిన్హా రాయ్‌.
గోవా చాలెంజర్స్‌: చెంగ్‌ చింగ్, అర్చన కామత్, అమల్‌రాజ్‌ ఆంథోని, సిద్ధేశ్‌ పాండే, శ్రుతి అమృతే, అల్వారో రోబెస్‌.
పుణేరీ పల్టన్‌: చాంగ్‌ చిన్‌ యా, హర్మీత్‌ దేశాయ్, ఐహిక ముఖర్జీ, సెలీనా సెల్వకుమార్, రోనిత్‌ భాన్‌జా, సబీనే వింటర్‌.
ఆర్‌పీ ఎస్‌జీ మావెరిక్స్‌ కోల్‌కతా: మనికా బత్రా, బెనెడిక్ట్‌ డ్యూడా, మాల్టిడా ఎకోమ్, మనుష్‌ షా, ప్రాప్తి షా, సనీల్‌ శెట్టి.
యు ముంబా టీటీ: డూ హోయ్‌ కెమ్, మానవ్‌ ఠక్కర్, సుతీర్థ ముఖర్జీ, కిరిల్‌ గెరాస్సిమెన్‌కో, జీత్‌ చంద్ర, మౌమితా దత్తా.

మరిన్ని వార్తలు