జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నీ
ముంబై: విశ్వవిజేతగా నిలిచిన భారత అంధుల క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన అజయ్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ జట్టును జాతీయ చాంపియన్గా నిలబెట్టాడు. శుక్రవారం ముగిసిన జాతీయ అంధుల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్ టైటిల్ను సొంతం చేసుకుంది. గుజరాత్తో జరిగిన ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్కు దిగిన గుజరాత్ నిర్ణీత 35 ఓవర్లలో 9 వికెట్లకు 250 పరుగులు చేసింది. ఆంధ్ర బౌలర్ దుర్గా రావు 28 పరుగులిచ్చి 4 వికెట్లు తీశాడు.
అనంతరం ఆంధ్రప్రదేశ్ 31.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టి. కృష్ణ (97 బంతుల్లో 103 నాటౌట్) అజేయ సెంచరీ చేయగా... కెప్టెన్ అజయ్ రెడ్డి 32 పరుగులు, వెంకటేశ్ రావు 66 పరుగులు సాధించారు. భారత జట్టు మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేత ఆంధ్రప్రదేశ్ జట్టుకు రూ. 50 వేలు... రన్నరప్గా గుజరాత్కు రూ. 30 వేలు అందజేశారు.