ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

30 Aug, 2017 01:52 IST|Sakshi
ఘనంగా జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానం

‘ఖేల్‌రత్న’ అందుకున్న జజరియా, సర్దార్‌ సింగ్‌
♦  ‘అర్జున’ స్వీకరించిన సాకేత్, జ్యోతి సురేఖ
♦  ప్రసాద్‌కు ‘ద్రోణాచార్య’  హకీమ్‌కు ‘ధ్యాన్‌చంద్‌’


రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా జాతీయ క్రీడా పురస్కారాలను స్వీకరిస్తున్న దేవేంద్ర జజరియా, సర్దార్‌ సింగ్‌ (ఖేల్‌రత్న), సాకేత్‌ మైనేని, జ్యోతి సురేఖ (అర్జున), గంగుల ప్రసాద్‌ (ద్రోణాచార్య లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌), హకీమ్‌ (ధ్యాన్‌చంద్‌ అవార్డు) కుడి నుంచి...

న్యూఢిల్లీ: హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్‌ జయంతి సందర్భంగా జరిగిన జాతీయ క్రీడా అవార్డుల పురస్కార కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ వేడుకల్లో అత్యున్నత రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డును పారాలింపియన్‌ దేవేంద్ర జజరియాతో పాటు హాకీ సీనియర్‌ ఆటగాడు సర్దార్‌ సింగ్‌... రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా అందుకున్నారు. వీరికి జ్ఞాపికతో పాటు రూ.7.5 లక్షల చొప్పున చెక్‌ను అందించారు. 2004 ఏథెన్స్, 2016 రియో పారాలింపిక్స్‌లో స్వర్ణాలు సాధించిన తొలి భారత క్రీడాకారుడిగా జావెలిన్‌ త్రోయర్‌ జజరియా నిలిచాడు.

 ఇక గత కొన్నేళ్లుగా మిడ్‌ ఫీల్డర్‌ సర్దార్‌ సింగ్‌ భారత విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలాగే 17 మంది క్రీడాకారులు అర్జున అవార్డు దక్కించుకోగా... కౌంటీ మ్యాచ్‌ల్లో ఆడుతున్న కారణంగా క్రికెటర్‌ చతేశ్వర్‌ పుజారా ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు. మిగతా వారంతా అర్జునను స్వీకరించారు. ఇందులో తెలుగు తేజాలు సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), జ్యోతి సురేఖ (ఆర్చరీ) కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ ‘ద్రోణాచార్య’ (లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌)... ఫుట్‌బాల్‌ క్రీడాభివృద్ధికి గుర్తింపుగా తెలంగాణకు చెందిన ఒలింపియన్‌ సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ ‘ధ్యాన్‌చంద్‌’ అవార్డులను అందుకున్నారు.

  రియో పారాలింపిక్స్‌ హైజంప్‌ (ఎఫ్‌46)లో స్వర్ణం సాధించిన మరియప్పన్‌ తంగవేలు అర్జున స్వీకరించేందుకు వస్తున్న సమయంలో ఆహుతుల నుంచి విశేష స్పందన కనిపించింది. రాష్ట్రీయ ఖేల్‌ ప్రోత్సాహన్‌ అవార్డును రిలయన్స్‌ ఫౌండేషన్‌ యూత్‌ స్పోర్ట్స్‌ తరఫున నీతా అంబానీ స్వీకరించారు. అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్‌చంద్‌ అవార్డు గ్రహీతలు జ్ఞాపిక, సర్టిఫికెట్‌లతో పాటు రూ. 5 లక్షల చొప్పున చెక్‌ను అందుకున్నారు.

‘దివ్యాంగ అథ్లెట్లకు ప్రోత్సాహం అందించాలి’
భారత పారా అథ్లెట్లకు ఇది చరిత్రాత్మకమైన రోజు అని దేవేంద్ర జజరియా అభిప్రాయపడ్డాడు. ‘నాలాంటి వారు భారత్‌లో ఐదు కోట్ల మంది అథ్లెట్లు ఉన్నారు. వారికి మరింత తోడ్పాటు అవసరం. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగ క్రీడాకారుల కోసం చాలా చేయాల్సి ఉంది’ అని 31 ఏళ్ల జజరియా కోరాడు.  

అవార్డు గ్రహీతలు
ఖేల్‌రత్న: దేవేంద్ర జజరియా(పారాథ్లెట్, జావెలిన్‌ త్రో), సర్దార్‌సింగ్‌ (హాకీ). అర్జున: సాకేత్‌ మైనేని (టెన్నిస్‌), జ్యోతి సురేఖ (ఆర్చరీ), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (క్రికెట్‌), ఖుష్బీర్‌ కౌర్, రాజీవ్‌ (అథ్లెటిక్స్‌), ప్రశాంతి సింగ్‌ (బాస్కెట్‌బాల్‌), దేవేంద్రో సింగ్‌ (బాక్సింగ్‌), బెంబేమ్‌ దేవి (ఫుట్‌బాల్‌), ఎస్‌ఎస్‌పీ చౌరాసియా (గోల్ఫ్‌), ఎస్‌వీ సునీల్‌ (హాకీ), జస్వీర్‌ సింగ్‌ (కబడ్డీ), ప్రకాష్‌ నంజప్ప (షూటింగ్‌), ఆంథోనీ అమల్‌రాజ్‌ (టీటీ), సత్యవర్త్‌ కడియాన్‌ (రెజ్లింగ్‌), తంగవేలు, వరుణ్‌ భటి (పారా అథ్లెట్స్‌). పుజారా (క్రికెట్‌). ద్రోణాచార్య: దివంగత డాక్టర్‌ ఆర్‌.గాంధీ (అథ్లెటిక్స్‌), జీఎస్‌ఎస్‌వీ ప్రసాద్‌ (బ్యాడ్మింటన్‌), బీబీ మహంతి (బాక్సింగ్‌), హీరానంద్‌ (కబడ్డీ), రాఫెల్‌ (హాకీ), సంజయ్‌ చక్రవర్తి (షూటింగ్‌), రోషన్‌ లాల్‌ (రెజ్లింగ్‌). ధ్యాన్‌చంద్‌: భూపిందర్‌ సింగ్‌ (అథ్లెటిక్స్‌), సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ (ఫుట్‌బాల్‌), సుమరాయ్‌ టెటే (హాకీ).

>
మరిన్ని వార్తలు