జాతీయ క్రీడలు నిరవధిక వాయిదా

29 May, 2020 00:27 IST|Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన జాతీయ క్రీడలు ఈసారి నిరవధికంగా వాయిదా వేశారు. క్రీడలకు ఆతిథ్యమివ్వాల్సిన గోవాలో కరోనా వ్యాప్తి పెరిగిపోవడంతో అనూహ్యంగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 4 వరకు జాతీయ క్రీడలు జరగాల్సి ఉంది. అయితే కరోనా దెబ్బకు జాతీయ క్రీడల నిర్వాహక కమిటీ ఈ వాయిదా నిర్ణయం తీసుకుందని గోవా క్రీడల మంత్రి మనోహర్‌ అగోంకర్‌ ఐఓఏకు తెలిపారు. సెప్టెంబర్‌ చివర్లో జరిగే కమిటీ సమావేశంలో క్రీడల షెడ్యూల్‌ను నిర్ణయిస్తామన్నారు. నిజానికి 2018 నవంబర్‌లోనే జరగాల్సిన ఈ క్రీడలు గోవా ప్రభుత్వ అలసత్వం కారణంగా ఇప్పటికి రెండుసార్లు వాయిదా పడ్డాయి. ఈ ఏడాది గేమ్స్‌ నిర్వహించేందుకు గోవా సిద్ధమైనప్పటికీ కరోనాతో మరోసారి ఆటంకం ఏర్పడింది. చివరిసారిగా 2015లో కేరళ వేదికగా జాతీయ క్రీడలు జరిగాయి. 

మరిన్ని వార్తలు