‘అతన్ని ఔట్‌ చేసే మార్గం కోసం అన్వేషణ’

23 May, 2020 13:23 IST|Sakshi

ఈసారి మళ్లీ అది రిపీట్‌ కాకూడదు

పుజారా బ్యాటింగ్‌పై కమిన్స్‌ కసరత్తు

సిడ్నీ: 2018-19 సీజన్‌లో భాగంగా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత జట్టు టెస్టు సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియా గడ్డపై భారత్‌కు తొలి టెస్టు సిరీస్‌ విజయం. ఆ సిరీస్‌లో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లో (ఏడు ఇన్నింగ్స్‌ల్లో) 521 పరుగులు సాధించి భారత్‌ టెస్టు సిరీస్‌ను గెలవవడంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఆ సిరీస్‌లో పుజరా అత్యధిక వ్యక్తిగత స్కోరు 193 కాగా మూడు సెంచరీలు సాధించాడు. అయితే ఈసారి అలా కానివ్వని అంటున్నాడు ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌. ప్రస్తుతం నంబర్‌ వన్‌ బౌలర్‌గా కొనసాగుతున్న కమిన్స్‌కు పుజారా బెంగ పట్టుకుంది. దానిలో భాంగా పుజారా బ్యాటింగ్‌పై కసరత్తు చేస్తున్నాడు కమిన్స్‌. ఈ సీజన్‌లో చివరిలో ఆస్ట్రేలియా పర్యటనకు భారత్‌ వెళ్లాల్సి ఉండటంతో పుజారా బ్యాటింగ్‌ గురించి ఆలోచిస్తున్నాడు కమిన్స్‌. (నీకు.. 3డీ కామెంట్‌ అవసరమా?: గంభీర్‌)

‘సాధ్యమైనంత వరకూ పుజారా క్రీజ్‌లో ఉండటానికి యత్నిస్తాడు. సుదీర్ఘ సమయం బ్యాటింగ్‌ చేసినా ఎక్కడ ఆందోళన లేకుండా క్రీజ్‌లో ఉంటాడు. అది అతనిలో ప్రత్యేకత. పుజారాను ఔట్‌ చేయడానికి మార్గాలు అన్వేషించాలి. గత ఆస్ట్రేలియా పర్యటనలో పుజారా బ్యాటింగ్‌తో అలరించాడు. అందుకోసం పిచ్‌లను మార్చాల్సిన అవసరం ఏమీ లేదు.. దేన్నీ తయారు చేయాల్సిన అవసరం లేదు. మా బౌలింగ్‌ బలంతోనే పుజారాను త్వరగా ఔట్‌ చేయడానికి ట్రై చేస్తాం. ఒకవేళ వికెట్‌ బౌన్స్‌కు అనుకూలిస్తే మా వద్ద మరిన్ని ఆప్షన్లు ఉంటాయి. చూద్దాం. ఏమి జరుగుతుందో’ అని కమిన్స్‌ తెలిపాడు. తాను ఆడే ప్రతీ టెస్టు నుంచి ఏదొక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి యత్నిస్తూ ఉంటానన్నాడు. ‘ప్రతీ సిరీస్‌కు మెరుగు పడుతూ ముందుకు సాగడమే నా లక్ష్యం. టెస్టు క్రికెట్‌ అనేది చాలా కొత్త పాఠాలను నేర్పుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టెస్టు క్రికెట్‌ అనేది ఘోరంగా సాగుతుంది. ప్రత్యర్థి జట్లు మొత్తం రోజంతా బ్యాటింగ్‌ చేస్తే, మరొక సందర్భంలో వారు బ్యాటింగ్‌ను కుప్పకూల్చడం వంటిది జరుగుతూ ఉంటుంది’ అని కమిన్స్‌ తెలిపాడు. (ధోనిని ఏనాడు అడగలేదు: రైనా)

ఐపీఎల్‌ -13వ సీజన్‌లో భాగంగా గతేడాది డిసెంబర్‌లో జరిగిన వేలంలో ఆసీస్‌ పేసర్‌ ప్యాట్‌ కమిన్స్‌ అత్యధిక ధరకు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. అతని కనీస ధర రెండు కోట్లు ఉండగా,  రూ. 15.50 కోట్లు వెచ్చించీ కోల్‌కతా నైట్‌రైడర్స్‌(కేకేఆర్‌) దక్కించుకుంది. ఫలితంగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడుపోయిన విదేశీ ఆటగాడిగా కమిన్స్‌ గుర్తింపు పొందాడు.  ఇదిలా ఉంచితే, భారత స్పెషలిస్టు టెస్టు ప్లేయర్‌గా ముద్ర సంపాదించుకున్న చతేశ్వర పుజారా.. ఐపీఎల్‌ ఆడి దాదాపు ఆరేళ్ల అవుతుంది.  టెస్టు ఆటగాడిగా ముద్ర పడిన పుజారాను కొనుగోలు చేయడానికి ఐపీఎల్‌ ఫ్రాంచైజీలు ముందుకు రావడం లేదు. దాంతో తిరిగి ఐపీఎల్‌ ఆడాలనుకుంటున్న పుజారా కల నెరవేరడం లేదు. తాను పరిస్థితులకు తగ్గట్టు ఆడతానని పదే పదే చెప్పుకుంటున్నా పుజారాపై ఆసక్తి కనబరచడం లేదు. 

మరిన్ని వార్తలు