సోథినే నా ఫేవరెట్‌ భారత క్రికెటర్‌!

29 Aug, 2019 13:07 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఇటీవల సోషల్‌ మీడియాలో అత్యంత యాక్టివ్‌గా ఉంటున్న  క్రికెటర్లలో న్యూజిలాండ్‌ క్రికెటర్‌ జేమ్స్‌ నీషమ్‌ ఒకడు. వరల్డ్‌కప్‌లో భాగంగా ఫైనల్‌ పోరులో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓటమి పాలైన తర్వాత నీషమ్‌.. ఎవ్వరూ క్రీడల్ని ఎంచుకోవద్దని యువతకు పిలుపినిచ్చి హాట్‌ టాపిక్‌గా మారిపోయాడు. ఇటీవల టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిపై ఛలోక్తి విసిరి విమర్శల పాలయ్యాడు.  యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ రోరీ బర్న్స్‌ రెండో రోజు ఆటలో 125 పరుగులు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. తొలి యాషెస్‌ ఇన్నింగ్స్‌లో కోహ్లి కంటే బర్న్స్‌ ఎక్కువ పరుగులు చేశాడని చమత్కరించాడు. ఇది కోహ్లి అభిమానులకు ఆగ్రహం తెప్పించడంతో విమర్శల ఎదుర్కొన్నాడు.

తాజాగా ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నకు నీషమ్‌ ఇచ్చిన సమాధానం నవ్వులు పూయించింది. ఇన్‌స్టాగ్రామ్‌​ అకౌంట్‌లో నీషమ్‌ ‘ఆస్క్‌ మీ ఎనీథింగ్‌’ నిర్వహించగా, అతనికి మీ ఫేవరెట్‌ భారత క్రికెటర్‌ ఎవరు’ అనే ప్రశ్న ఎదురైంది.  దీనికి కోహ్లిని కానీ, ధోనిని కానీ ఎంపిక చేసుకుంటాడని సదరు అభిమాని భావించాడు. ఇందుకు నీషమ్‌ కొంటెగా సమాధానమిస్తూ..  భారత్‌ సంతతికి చెందిన ఇష్‌ సోథీనే తన ఫేవరెట్‌ క్రికెటర్‌ అని పేర్కొన్నాడు.  భారత మూలాలున్న ఇష్‌ సోథీ న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దాంతో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టుపై అభిమానాన్ని చూపెడుతూ.. తన ఫేవరెట్‌ క్రికెటర్‌గా సోథీని ఎంచుకున్నాడు నీషమ్‌.

అంతకుముందు యాషెస్‌ సిరీస్‌ మూడో టెస్టులో వీరోచిత సెంచరీతో ఇంగ్లండ్‌ను గెలిపించిన బెన్‌ స్టోక్స్‌ను ప్రశంసించాడు నీషమ్‌. ఇక్కడ కూడా స్టోక్స్‌ న్యూజిలాండ్‌  దేశస్తుడనే విషయాన్ని ప్రస్తావించాడు. తమ దేశానికి చెందిన స్టోక్స్‌ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌ను గెలిపించాడంటూ ట్వీట్‌ చేశాడు.

మరిన్ని వార్తలు