సిగ్గుందా: పాక్‌ క్రికెటర్‌పై నెటిజన్ల ఫైర్‌!

10 Dec, 2019 12:01 IST|Sakshi

పాకిస్తాన్‌ క్రికెటర్‌, హరియాణా అల్లుడు హసన్‌ అలీపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ‘ఆటను వదిలావు సరే.. మరి మోడలింగ్‌ ఎందుకు చేస్తున్నావు. కాస్తైనా సిగ్గుండాలి నీకు... ఇప్పుడు గాయం అడ్డురావడం లేదా. నిన్ను అసలు మళ్లీ పాక్‌ జట్టులోకి తీసుకోకూడదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల పాక్‌ జట్టులో స్థానం కోల్పోయిన హసన్‌.. ర్యాంప్‌ వాక్‌ చేయడమే వారి ఆగ్రహానికి కారణం. శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ కోసం పాక్‌ క్రికెట్ జట్టు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే. బుధవారం(డిసెంబరు 11) నుంచి రావల్పిండి క్రికెట్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ ఆరంభం కానుంది. 

కాగా హసన్‌ అలీ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. టెస్టు మ్యాచ్‌ కోసం జరిగిన సెలక్షన్స్‌లో పక్కటెముకల నొప్పితో బాధ పడుతున్న కారణంగా అలీని పక్కన పెట్టారు. అదే విధంగా ఆస్ట్రేలియాతో ఇటీవల జరిగిన టీ20 సిరీస్‌కు సైతం అలీ అందుబాటులో లేడు. అయితే ప్రస్తుతం ఓ కార్యక్రమం సందర్భంగా హసన్‌ అలీ ర్యాంప్‌ వాక్‌ చేస్తూ.. ఉత్సాహంగా గడిపాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. దీంతో.. ‘ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టి.. తిరిగి జట్టులోకి వస్తావనుకుంటే ర్యాంప్‌ వాక్‌ చేస్తూ బాగానే ఉన్నావే’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. కాగా అలీ పాకిస్తాన్‌ తరఫున 53 వన్డేలు, 30 టీ20 మ్యాచ్‌లు, తొమ్మిది టెస్టులు ఆడాడు. ఆగస్టులో భారత్‌కు చెందిన యువతిని అతడు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  

మరిన్ని వార్తలు