భారత్‌తో టీ20 సిరీస్‌: కివీస్‌కు షాక్‌

16 Jan, 2020 21:03 IST|Sakshi

వెల్లింగ్టన్‌: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌ ముగిశాక సుదీర్ఘ పర్యటన కోసం టీమిండియా న్యూజిలాండ్‌ బయల్దేరనుంది. ఈ పర్యటనలో రెండు జట్ల మధ్య ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టు మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే టీ20 ప్రపంచకప్‌ దృష్ట్యా ఈ సిరీస్‌ను ఇరుజట్ల ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అయితే ఈ కీలక సిరీస్‌కు ముందు ఆతిథ్య కివీస్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ప్రధాన బౌలర్లు ట్రెంట్‌ బౌల్ట్‌, ఫెర్గుసన్‌లు గాయం కారణంగా టీ20 సిరీస్‌కు దూరమయ్యారు.

ఈ ఇద్దరు దూరమవడంతో టీ20 సిరీస్‌ కోసం గురువారం ప్రకటించిన కివీస్‌ జట్టులో అనూహ్యంగా 32 ఏళ్ల బెనెట్‌కు అవకాశం కల్పించారు. బెనెట్‌ గత రెండేళ్లలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడకపోవడం గమనార్హం. కేన్‌ విలియమ్సన్‌ సారథ్యంలోని 14 మంది ఆటగాళ్ల జాబితాలో సీనియర్‌ ఆటగాళ్లు మార్టిన్‌ గప్టిల్‌, రాస్‌ టేలర్‌, కొలిన్‌ మున్రో, కొలిన్‌ డి గ్రాండ్‌ హోమ్‌లు చోటు దక్కించుకున్నారు. ఈ నెల 24న జరగబోయే తొలి టీ20తో కివీస్‌ పర్యటనను టీమిండియా ప్రారంభించనుంది.  

న్యూజిలాండ్‌ టీ 20 జట్టు
కేన్‌ విలియమ్సన్‌ (కెప్టెన్‌), మార్టిన్‌ గప్తిల్, కొలిన్‌ మున్రో, టేలర్, గ్రాండ్‌హోమ్, బ్లైర్‌ టిక్నర్, మిచెల్‌ శాంట్నర్, టిమ్‌ సైఫర్ట్‌ (వికెట్‌ కీపర్‌), ఇస్‌ సోధి, టిమ్‌ సౌథీ, హమీశ్‌ బెనెట్, టామ్‌ బ్రూసీ, కుగ్లీజిన్, డార్లీ మిచెల్‌.   

>
మరిన్ని వార్తలు