49 ఏళ్ల తర్వాత... 

8 Dec, 2018 00:54 IST|Sakshi

విదేశాల్లో పాకిస్తాన్‌పై సిరీస్‌ నెగ్గిన న్యూజిలాండ్‌

మూడో టెస్టులో 123 పరుగులతో విజయం  

అబుదాబి: బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా పాకిస్తాన్‌తో మూడు టెస్టుల సిరీస్‌ను న్యూజిలాండ్‌ 2–1తో కైవసం చేసుకుంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకున్న పాక్‌ రెండో సొంతగడ్డలాంటి యూఏఈలో వరుసగా రెండో టెస్టు సిరీస్‌ కోల్పోయింది. శుక్రవారం ముగిసిన చివరిదైన మూడో టెస్టులో కివీస్‌ 123 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 49 ఏళ్ల తర్వాత విదేశీ గడ్డపై పాకిస్తాన్‌పై సిరీస్‌ విజయం సాధించింది. ఓవర్‌నైట్‌ స్కోరు 272/4తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన న్యూజిలాండ్‌ 353/7 వద్ద డిక్లేర్‌ చేసింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (139; 13 ఫోర్లు) క్రితం రోజు స్కోరు వద్దే వెనుదిరగ్గా... నికోల్స్‌ (126 నాటౌట్‌; 12 ఫోర్లు) సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

యాసిర్‌ షా 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం 280 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌ బరిలో దిగిన పాకిస్తాన్‌ 56.1 ఓవర్లలో 156 పరుగులకే కుప్పకూలింది. బాబర్‌ ఆజమ్‌ (51; 5 ఫోర్లు) ఒక్కడే అర్ధశతకం సాధించగా... మిగ తావారు పూర్తిగా విఫలమయ్యారు. కెరీర్‌లో చివరి టెస్టు ఆడిన హఫీజ్‌ (8) నిరాశ పరిచాడు. కివీస్‌ బౌలర్లలో సౌథీ, ఎజాజ్‌ పటేల్, సోమెర్‌విల్లే మూడేసి వికెట్లు పడగొట్టారు. విలియమ్సన్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’, యాసిర్‌ షాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డులు దక్కాయి.   

మరిన్ని వార్తలు