హామిల్టన్: ప్రపంచ కప్లో న్యూజిలాండ్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఆరో విజయం నమోదు చేసి డబుల్ హ్యాట్రిక్ కొట్టింది. లీగ్ దశను విజయవంతంగా ముగించి గ్రూపు-ఎ టాపర్గా క్వార్టర్స్ బరిలో దిగనుంది. శుక్రవారం బంగ్లాదేశ్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో కివీస్ మూడు వికెట్లతో బంగ్లాదేశ్పై గెలుపొందింది. కాగా బంగ్లా ఆద్యంతం కివీస్కు గట్టిపోటీనిచ్చింది.
బంగ్లాదేశ్ నిర్దేశించిన 289 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి మరో 7 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ సెంచరీ చేశాడు. గుప్టిల్ 88 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో శతకం బాదాడు. వన్డేల్లో గుప్టిల్కిది ఆరో సెంచరీ. రాస్ టేలర్ హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లా బౌలర్ షకీబల్ ధాటికి ఓ దశలో కివీస్ 33 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. షకీబల్ ఒకే ఓవర్లో కివీస్ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్, విలియమ్సన్లను అవుట్ చేశాడు. ఆ తర్వాత గుప్టిల్, టేలర్ జట్టును ఆదుకున్నారు. కాగా కివీస్ చివర్లో వెంటవెంటనే వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ హోరాహోరీగా మారింది. ఇలియట్ (39), ఆండర్సన్ (39) రాణించినా కీలక సమయంలో అవుటయ్యారు. చివర్లో వెట్టోరి, సౌథీ జట్టును గెలిపించారు. షకీబల్ నాలుగు, నాసిర్ హొస్సేన్ రెండు వికెట్లు తీశారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 288 పరుగులు చేసింది. మహ్మదుల్లా (128 నాటౌట్) మరోసారి సెంచరీతో చెలరేగాడు. ప్రపంచ కప్లో మహ్మదుల్లాకిది రెండో సెంచరీ కావడం విశేషం. సౌమ్యా సర్కార్ (51) హాఫ్ సెంచరీకి తోడు సబ్బీర్ రెహ్మాన్ (40) రాణించాడు. కివీస్ బౌలర్లు బౌల్ట్, ఆండర్సన్, ఇలియట్ రెండేసి వికెట్లు తీశారు.