శ్రీలంక... ఓటమి దిశగా

30 Dec, 2018 01:59 IST|Sakshi

రెండో ఇన్నింగ్స్‌లో 231/6

కివీస్‌తో రెండో టెస్టు  

క్రైస్ట్‌చర్చ్‌: న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరిదైన రెండో టెస్టులో శ్రీలంక పరాజయం దిశగా పయనిస్తోంది. ఈ టెస్టుతో పాటు సిరీస్‌ విజయానికి ఆతిథ్య కివీస్‌ సిద్ధమైంది. నాలుగో రోజు 660 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 6 వికెట్లకు 231 పరుగులు చేసింది. గాయపడిన మాథ్యూస్‌ క్రీజ్‌లోకి దిగడం అనుమానమే. దీంతో మరో వికెట్‌ లోటుతో లంక ఉంది. 24/2 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన శ్రీలంకను పేసర్‌ వాగ్నర్‌ (3/47) దెబ్బతీశాడు.

క్రీజ్‌లో పాతుకు పోయిన కుశాల్‌ మెండిస్‌ (67; 10 ఫోర్లు), కెప్టెన్‌ చండిమల్‌ (56; 5 ఫోర్లు)లతో పాటు రోషన్‌ సిల్వా (18)ను పెవిలియన్‌ చేర్చాడు. డిక్‌వెలా (22) సౌతీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. లంక 208 పరుగుల వద్ద 6 వికెట్లను కోల్పోయింది. ఆట నిలిచే సమయానికి దిల్‌రువాన్‌ పెరీరా (22 బ్యాటింగ్‌; 3 ఫోర్లు), లక్మల్‌ (16 బ్యాటింగ్‌; 3 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. టెస్టుకు ఆదివారం ఆఖరి రోజు కాగా... చేతిలో 4 వికెట్లున్న లంక ఇంకా 429 పరుగులు చేయడం అసాధ్యం. దీంతో న్యూజిలాండ్‌  తొలి సెషన్‌లోనే మిగతా వికెట్లను పడగొట్టి సిరీస్‌ను చేజిక్కించుకునే అవకాశముంది. తొలి టెస్టు వర్షం వల్ల డ్రా అయింది.   

మరిన్ని వార్తలు