బంగ్లాదేశ్‌లో కివీస్‌ పర్యటన వాయిదా

24 Jun, 2020 04:59 IST|Sakshi

ఢాకా: కరోనా మహమ్మారి ఉధృతి కారణంగా... బంగ్లాదేశ్‌లో న్యూజిలాండ్‌ క్రికెట్‌ జట్టు పర్యటన వాయిదా పడింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్‌లో కివీస్‌ పర్యటించాల్సి ఉంది. గతవారం ముగ్గురు బంగ్లాదేశ్‌ క్రికెటర్లు వైరస్‌ బారిన పడ్డారు. మాజీ వన్డే కెప్టెన్‌ మొర్తజా, నజ్ముల్‌ ఇస్లామ్, నఫీజ్‌ ఇక్బాల్‌లకు కరోనా సోకినట్లు గతవారం జరిపిన టెస్టుల్లో తేలింది.  ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిజాముద్దీన్‌ చౌధరి మాట్లాడుతూ ‘ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ సిరీస్‌ నిర్వహణ సవాలుతో కూడుకున్నది. ఆటగాళ్లు, సహాయ సిబ్బంది తదితరుల ఆరోగ్యంతో ఆటలు ఆడలేం. సిరీస్‌పై ముందుకు వెళ్లలేం. అందుకే ఇరు దేశాల క్రికెట్‌ బోర్డులు సమాలోచనలు జరిపి... వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకంటే మేలైన ప్రత్యామ్నాయం ఏదీ లేదు’ అని అన్నారు. ఇరు బోర్డులు కొత్త షెడ్యూలుపై సంప్రదింపులు జరిపాక కొత్త తేదీల్ని ప్రకటిస్తామన్నారు. బంగ్లాదేశ్‌లో లక్ష మందికిపైగా వైరస్‌ సోకగా... సుమారు 1500 మంది చనిపోయారు. 

>
మరిన్ని వార్తలు