ఇన్నింగ్స్‌ విజయమే.. కానీ నో పాయింట్స్‌!

26 Nov, 2019 11:46 IST|Sakshi

మౌంట్‌ మాంగని (న్యూజిలాండ్‌): ఒకవైపు ఆస్ట్రేలియా-పాకిస్తాన్‌ జట్ల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌, మరొకవైపు భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్‌.. వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే.. న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ల మధ్య జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌ మాత్రం టెస్టు చాంపియన్‌షిప్‌లో లేదు. ఏ దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక టెస్టు సిరీస్‌ అయినా టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగం అనుకుంటే పొరపడినట్లే. ఇప్పుడు న్యూజిలాండ్‌-ఇంగ్లండ్‌ల సిరీస్‌ ఇందుకు ఉదాహరణ.  ఇందుకు కారణం.. ప్రపంచ టెస్ట్‌ చాంపి యన్‌షిప్‌(2019-21) నిబంధన ప్రకా రం ప్రతిజట్టూ ఆరు సిరీస్‌లు ఆడాలి.

ఇందులో స్వదేశంలో మూడు విదేశంలో మూడు ఉంటాయి. అందువల్ల అన్ని సిరీస్‌ లను టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. వాటిలో ప్రస్తుత ఇంగ్లండ్‌-కివీస్‌ల మధ్య జరిగే రెండు టెస్టుల సిరీస్‌ ఒకటి. ఈ సిరీస్‌ను కూడా చేర్చితే.. ఇంగ్లండ్‌ బయట ఎక్కువ సిరీస్‌లు ఆడాల్సి వచ్చేది. అలా జరిగితే మొత్తం చాంపియన్‌ షిప్‌ షెడ్యూల్‌ కాస్త అయోమయంలో పడేది. దాంతోనే ఈ టెస్టు సిరీస్‌ను వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌లో చేర్చలేదు. దాంతో న్యూజిలాండ్‌ గెలిచినా టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్లు రావు. ఇది ఒకవేళ టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమైతే తొలి టెస్టులో గెలిచిన కివీస్‌ ఖాతాలో 60 పాయింట్లు చేరేవి.

ఇప్పటివరకూ ఇది టెస్టు చాంపియన్‌షిప్‌లో భాగమని కివీస్‌ అభిమానులకు మింగుడు పడని అంశం.  కివీస్‌ అద్భుతమైన విజయం సాధించినా వరల్డ్‌ టెస్టు చాంపియన్‌ పాయింట్ల పరిధిలోకి రాకపోవడంతో అయ్యో బ్లాక్‌క్లాప్స్‌ అనుకుంటున్నారు.ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఆల్‌రౌండ్‌ షోతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ తొలి టెస్టులో ఇన్నింగ్స్, 65 పరుగుల ఆధిక్యంతో ఘన విజయం సాధించింది. దాంతో సిరీస్‌లో కివీస్‌ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా డబుల్‌ సెంచరీ హీరో వాట్లింగ్‌ నిలిచాడు. రెండో టెస్టు శుక్రవారం ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ గెలిస్తే సిరీస్‌ను 2-0తో గెలుచుకుంటుంది. ఒకవేళ ఇంగ్లండ్‌ గెలిస్తే సిరీస్‌ సమం అవుతుంది. డ్రా అయితే సిరీస్‌ కివీస్‌దే.

మరిన్ని వార్తలు