నిఖత్, ప్రసాద్‌లకు కాంస్యాలు

24 May, 2019 00:49 IST|Sakshi

గువాహటి: ఇండియా ఓపెన్‌ అంతర్జాతీయ బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్‌ బాక్సర్‌ పొలిపల్లి లలితా ప్రసాద్‌ (పురుషుల 52 కేజీలు), తెలంగాణ అమ్మాయి నిఖత్‌ జరీన్‌ (మహిళల 51 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు. గురువారం జరిగిన సెమీఫైనల్స్‌లో దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌ 4–1తో నిఖత్‌ను ఓడించగా... లలితా ప్రసాద్‌ 0–5తో ఆసియా చాంపియన్‌ అమిత్‌ పంఘల్‌ (భారత్‌) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఓవరాల్‌గా పురుషుల విభాగంలో 31 పతకాలు... మహిళల విభాగంలో 26 పతకాలు భారత్‌కు ఖాయమయ్యాయి. పురుషుల 52 కేజీల విభాగం ఫైనల్లో అమిత్‌తో భారత్‌కే చెందిన సచిన్‌ సివాచ్‌ తలపడతాడు. సెమీస్‌లో సచిన్‌ 5–0తో గౌరవ్‌ సోలంకిపై గెలిచాడు. పురుషుల 60 కేజీల విభాగంలో వరుసగా నాలుగు ఆసియా చాంపియన్‌షిప్‌లలో పతకాలు నెగ్గిన శివ థాపా (భారత్‌), మనీశ్‌ కౌశిక్‌ (భారత్‌) స్వర్ణ పతక పోరుకు సిద్ధమయ్యారు.

సెమీఫైనల్స్‌లో శివ థాపా 5–0తో క్రిస్టియన్‌ జెపాన్‌స్కీ (పోలాండ్‌)పై, మనీశ్‌ 5–0తో అంకిత్‌ (భారత్‌)పై విజయం సాధించారు. పురుషుల 49 కేజీల విభాగంలోనూ ఇద్దరు భారత బాక్సర్లు దీపక్, గోవింద్‌ కుమార్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో కరోలో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌) నుంచి దీపక్‌కు వాకోవర్‌ లభించగా... తషీ వాంగ్డి (భూటాన్‌)పై గోవింద్‌ నెగ్గాడు. 56 కేజీల విభాగం సెమీఫైనల్స్‌లో కవిందర్‌ బిష్త్‌ 4–1తో మదన్‌ లాల్‌ (భారత్‌)పై, చాట్‌చాయ్‌ డెచా (థాయ్‌లాండ్‌) 5–0తో గౌరవ్‌ బిధురి (భారత్‌) పై విజయం సాధించారు. భారత్‌కే చెందిన రోహిత్‌ (64 కేజీలు), ఆశిష్‌ (69 కేజీలు), దుర్యోధన్‌ సింగ్‌ (69 కేజీలు), ఆశిష్‌ కుమార్‌ (75 కేజీలు), బ్రిజేశ్, మనీశ్‌ పవార్‌ (81 కేజీలు) ఫైనల్‌కు చేరారు.  

మరిన్ని వార్తలు