ట్రయల్స్‌కు బాక్సర్‌ నిఖత్‌ అర్హత

22 Dec, 2019 01:14 IST|Sakshi
నిఖత్‌ జరీన్‌

మేరీకోమ్‌తో పోటీకి అవకాశం

న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు నిర్వహించనున్న సెలక్షన్‌ ట్రయల్స్‌కు తెలంగాణ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ అర్హత సాధించింది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్, జ్యోతి గులియా, రితూ గ్రేవాల్‌లతో పాటు నిఖత్‌కు ఈ అవకాశం దక్కింది. ఈ నెల 27, 28 తేదీల్లో ట్రయల్స్‌ జరుగుతాయి. ఈ నలుగురు బాక్సర్లకు ర్యాంకింగ్స్‌ కేటాయించగా మేరీకోమ్‌ మొదటి, నిఖత్‌ రెండో స్థానంలో ఉన్నారు. భారత బాక్సింగ్‌ సమాఖ్య (బీఎఫ్‌ఐ) నిబంధనల ప్రకారం తొలి స్థానంలో ఉన్న మేరీకోమ్, నాలుగో స్థానంలో ఉన్న రితూతో తలపడుతుంది. జ్యోతిని నిఖత్‌ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రెండు బౌట్‌లలో గెలిచిన వారి మధ్య ఫైనల్‌ బౌట్‌ ఉంటుంది. మేరీ, నిఖత్‌ తమ తొలి బౌట్‌లలో విజయం సాధిస్తే వారిద్దరు ఫైనల్లో తలపడతారు. తుది విజేతకు మాత్రమే ఫిబ్రవరిలో చైనాలో జరిగే ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో భారత్‌ తరఫున పాల్గొనే అవకాశం ఉంటుంది.

>
మరిన్ని వార్తలు