నిఖత్ జరీన్‌కు స్వర్ణం

14 Jul, 2014 01:34 IST|Sakshi
నిఖత్ జరీన్‌కు స్వర్ణం

వోజ్‌వోదినా (సెర్బియా): ‘గోల్డెన్ గ్లవ్ ఆఫ్ వోజ్‌వోదినా’ అంతర్జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పసిడితో మెరిసింది. సెర్బియాలోని సుబోటికా వోజ్‌వోదినాలో జరిగిన ఈ పోటీల్లో నిఖత్ 54 కేజీల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఆమె ఆర్‌ఎస్‌సీ (రిఫరీ స్టాప్స్ కాంటెస్ట్)తో ఫెరెన్జ్ జూడిత్ (హంగేరీ)ని చిత్తు చేసింది.
 
 తొలి రౌండ్‌లోనే జరీన్ పంచ్‌లను తట్టుకోలేక ప్రత్యర్థి కుప్పకూలడంతో బౌట్‌ను నిలిపివేసి భారత బాక్సర్‌ను విజేతగా ప్రకటించారు. గతంలో కూడా సెర్బియాలోనే జరిగిన నేషన్స్ కప్‌లో ఈ బాక్సర్ విజేతగా నిలిచింది. ‘ఈ విజయం ఎంతో ప్రత్యేకం. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ సెర్బియాలో మరోసారి స్వర్ణం నెగ్గడం చాలా సంతోషంగా ఉంది’ అని జరీన్ ఆనందం వ్యక్తం చేసింది.
 

మరిన్ని వార్తలు