నిఖిల్‌దీప్ శ్రమ వృథా

7 Feb, 2014 00:13 IST|Sakshi

 జింఖానా, న్యూస్‌లైన్: ఈఎంసీసీ బౌలర్ నిఖిల్‌దీప్ (5/52) చక్కని బౌలింగ్‌తో ప్రత్యర్థి జట్టును కట్టడి చేసినప్పటికీ ఆ జట్టుకు విజయం చేకూరలేదు. హెచ్‌సీఏ మూడు రోజుల నాకౌట్ టోర్నీలో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో డెక్కన్ క్రానికల్ జట్టు 149 పరుగుల భారీ తేడాతో ఈఎంసీసీ జట్టుపై విజయం సాధించింది.
 
 తొలుత డెక్కన్ క్రానికల్ 8 వికెట్ల నష్టానికి 307 పరుగులు చేసింది. అక్షత్ రెడ్డి (76), రాజన్ (50), రాహుల్ సింగ్ (58) అర్ధ సెంచరీలతో చెలరేగారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఈఎంసీసీ 158 పరుగులకే చేతులెత్తేసింది. సూర్యతేజ (95 నాటౌట్) అర్ధ సెంచరీతో అజేయంగా నిలిచాడు. డెక్కన్ క్రానికల్ బౌలర్ షబాబ్ తుంబి 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో ఎన్స్‌కోన్స్ బౌలర్ రోహన్ 5 వికెట్లు పడగొట్టి బీడీఎల్ జట్టుకు ముచ్చెమటలు పట్టించాడు. తొలుత బీడీఎల్ 191 పరుగులకు కుప్పకూలింది. యతిన్ రెడ్డి (50) అర్ధ సెంచరీతో రాణించగా... సంతోష్ (40), సుమంత్ (30) ఫర్వాలేదనిపించారు. తర్వాత బ్యాటింగ్ చేసిన ఎన్స్‌కోన్స్ వికెట్ కోల్పోయి 196 పరుగులు చేసి నెగ్గింది. తన్మయ్ అగర్వాల్ (84 నాటౌట్), ఇబ్రహీం ఖలీద్ (50 నాటౌట్) అర్ధ సెంచరీలతో రాణించగా... అజ్మత్ ఖాన్ 34 పరుగులు చేశాడు.
 
 ఇతర మ్యాచ్‌ల స్కోర్లు
 ఎస్‌బీహెచ్: 316/8 (అనిరుధ్ సింగ్ 49, సుమంత్ 47, కుషాల్ 54, ఆకాశ్ 41); ఏఓసీ: 272 (సచిన్ 49, పెంటారావు 129; ఆల్‌ఫ్రెడ్ అబ్సొలేమ్ 4/34, ఆకాశ్ బండారి 4/47).  ఆంధ్రాబ్యాంక్: 242/6 (నవీన్ రెడ్డి 48, రవితేజ 67, విహారి 48, అభినవ్ కుమార్ 36 నాటౌట్); ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ: 165 (బాషా 51, లలిత్ మోహన్ 3/37).
 

>
మరిన్ని వార్తలు