రయ్ రయ్ రానా

21 Apr, 2017 20:14 IST|Sakshi
రయ్ రయ్ రానా

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 ఆరంభానికి ముందు అందరి కళ్లూ స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్లపైనే. ఈ సీజన్ లో వీరు మరోసారి సత్తా చాటి అభిమానుల్ని అలరిస్తారని అంతా ఎదురుచూస్తున్న తరుణంలోనే రయ్ రయ్ మంటూ దూసుకొచ్చాడు నితీష్ రానా. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న రానా తన సంచలన ఆట తీరుతో ఇప్పుడు ఒక్కసారిగా స్టార్ క్రికెటర్ల జాబితాలో చేరిపోయాడు.

ఈ సీజన్ ఐపీఎల్లో ఇప్పటివరకూ ఐదు మ్యాచ్ లు ఆడి మూడు హాఫ్ సెంచరీల సాయంతో 255 పరుగులు సాధించి టాప్ లో ఉన్నాడు. తొలి మ్యాచ్ నుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతున్న రానా దూకుడే మంత్రంగా చెలరేగిపోతున్నాడు. రైజింగ్ పుణెతో ముంబై తలపడిన తొలి మ్యాచ్ లో రానా 28 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులతో ఆకట్టుకున్నాడు.ఇక కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన రెండో మ్యాచ్ లో హాఫ్ సెంచరీతో దుమ్ము రేపాడు. 29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో  50 పరుగులు నమోదు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై సన్ రైజర్స్ హైదరాబాద్ తో మ్యాచ్ లో 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 పరుగులు సాధించాడు. అయితే రాయల్ చాలెంజర్స్ తో జరిగిన మ్యాచ్ లో రానా నిరాశ పరిచాడు. కేవలం ఆ మ్యాచ్ లో 11 పరుగులు మాత్రమే నమోదు చేశాడు రానా. అటు తరువాత గుజరాత్ లయన్స్ తో మ్యాచ్ రానా మరో హాఫ్ సెంచరీ సాధించాడు.36 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేశాడు. ఇక గురువారం కింగ్స్ పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో  రానా సిక్సర్ల వర్షం కురిపించాడు.34 బంతుల్లో ఏడు సిక్సర్లతో 62 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.


కేకేఆర్ వద్దనుకుందా?

ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించే రానా గురించి ఆ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ కు బాగా తెలుసు.2015-16 దేశవాళీ సీజన్ లో భాగంగా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో రానా విశేషంగా రాణించాడు. ఆ సీజన్ లో 299 పరుగులు సాధించి సహచర ఢిల్లీ ఆటగాళ్లు రిషబ్ పంత్, ఉన్ముక్ చంద్ల సరసన నిలిచాడు. దాంతో 2016 సీజన్ ఐపీఎల్లో కోల్ కతా నైట్ రైడర్స్ రానాను తీసుకోవాలని తొలుత భావించింది. అతని ఎంపికపై గౌతం గంభీర్ చాలా పట్టాడు కూడా. అయితే కోల్ కతా యాజమాన్యం రానా ఎంపికకు మొగ్గు చూపలేదు.విజయ్ హజారే ట్రోఫీలో రానా విఫలమయ్యాడనే కారణంతో అతన్ని కేకేఆర్ జట్టులోకి తీసుకోలేదు. దాంతో ముంబై ఇండియన్స్ గతేడాది సీజన్ లో రానా ను రూ.10 లక్షల పెట్టి జట్టులోకి తీసుకుంది. ఇప్పుడు ముంబై జట్టులోనే అతన్ని కొనసాగించడం ఆ జట్టుకు వరంలా మారింది. ముంబై ఇండియన్స్ వరుస విజయాల్లో రానా పాత్ర వెలకట్టలేనిది. ప్రధానంగా గంభీర్ నేతృత్వంలోని కోల్ కతాపై రానా అసలైన మజాను అందించాడు. ముంబై ఇండియన్స్ విజయానికి 23 బంతుల్లో 63 పరుగులు చేయాల్సిన తరుణంలో రానా మెరుపులు మెరిపించాడు. ఇక చివర్లో కృణాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యాలు బ్యాట్ ఝుళిపించడంతో ముంబై బంతి ఉండగానే విజయం సాధించి కోల్ కతాకు షాకిచ్చింది.


'సిక్సర్' పిడుగు

ప్రస్తుతం రేసుగుర్రంలా దూసుకువస్తున్న రానా నిజంగానే 'సిక్సర్' పిడుగు అని నిరూపించుకున్నాడు.  ఈ సీజన్ ఐపీఎల్లో రానా ఆడిన తొలి ఐదు  మ్యాచ్ లు ఒక ఎత్తయితే కింగ్స్ పంజాబ్ తో ముంబై ఇండియన్స్ తలపడిన ఆరో మ్యాచ్ రానాను మరో స్టేజ్ కు తీసుకెళ్లిపోయింది. కింగ్స్ పంజాబ్ మ్యాచ్ లో ఒక ఫోర్ కూడా కొట్టని రానా.. సిక్సర్ల మోత మోగించాడు. ఆ మ్యాచ్ లో రానా ఏడు సిక్సర్లు కొట్టగా అందులో ఒక ఫోర్ లేకపోవడం గమనార్హం. కింగ్స్ విసిరిన 199 పరుగుల భారీ లక్ష్య ఛేదన సైతం రానా దెబ్బకు చిన్నబోయింది. తొలుత బట్లర్ విశ్వరూపం ప్రదర్శించగా, అటు తరువాత రానా విధ్వంసకర ఆట తీరుతో చెలరేగిపోయాడు ఈ ఢిల్లీ కుర్రాడు. దాంతో కింగ్స్ విసిరిన లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఉఫ్ అని ఊదేశారు. ప్రస్తుతం మూడు హాఫ్ సెంచరీలతో పరుగుల పరంగా టాప్ లో ఉన్న రానాపై అప్పుడే టీమిండియా సెలక్టర్లు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇక భారత జాతీయ క్రికెట్ జట్టులో రానాను ఎంపిక చేయడం ఖాయమేనంటూ పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఈ ఐపీఎల్ సీజన్ లో సగం మ్యాచ్ లకు పైగా ఉండటంతో రానా మరెన్ని అద్భుతాలు చేస్తాడో చూడాలి.

మరిన్ని వార్తలు