మాటల్లేవ్‌... ప్రేక్షకులూ ఉండరు

7 May, 2020 00:40 IST|Sakshi

కఠిన ఆంక్షల మధ్య దక్షిణ కొరియాలో మొదలుకానున్న ఫుట్‌బాల్‌ సీజన్‌

సియోల్‌: రెండు నెలల విరామం అనంతరం దక్షిణ కొరియాలో ఆట మొదలుకానుంది. కరోనా నేపథ్యంలో కఠిన నిబంధనల నడుమ శుక్రవారం నుంచి అక్కడ ‘కె–లీగ్‌ టోర్నీ’తో ఫుట్‌బాల్‌ సీజన్‌ ప్రారంభమవనుంది. కోవిడ్‌–19 సంక్షోభం తర్వాత ఆసియాలో జరుగనున్న తొలి మేజర్‌ ఈవెంట్‌ ఇదే కావడం విశేషం. అయితే ఈ టోర్నీని ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తున్నారు. ఫుట్‌బాలర్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఆట సందర్భంగా సహచరులతో మాట్లాడటం, కరచాలనం, గోల్‌ సంబరాలు చేసుకోవడంపై ఆంక్షలు విధించారు. టోర్నీలో భాగంగా ప్రతీ మ్యాచ్‌కు ముందు ఆటగాళ్లతో పాటు సిబ్బందికి పరీక్షలు నిర్వహించనున్నారు.

సీజన్‌ మధ్యలో ఏ ఆటగాడికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే... ఆ ఆటగాడి జట్టుతో పాటు, ఆ జట్టుతో తలపడిన ప్రత్యర్థి జట్లు రెండు వారాల పాటు టోర్నీకి దూరంగా ఉండాల్సి వస్తుంది. మ్యాచ్‌కు ముం దు కరచాలనానికి బదులుగా శిరస్సు వంచి మర్యాదపూర్వకంగా పలకరించాలని ఆటగాళ్లకు సూచించారు. శుక్రవారం జరుగనున్న తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ జియోన్‌బక్‌ మోటార్స్‌తో సువెన్‌ బ్లూవింగ్స్‌ ఆడతుంది. ఈ టోర్నీలో మొత్తం 12 జట్లు ఆడనున్నాయి. మైదానంలో సహచరులతో మాట్లాడకుండా పుట్‌బాల్‌ ఆడటం అసాధ్యమని ఇంచియోన్‌ యుౖ¯ð టెడ్‌ కెప్టెన్‌ కిమ్‌ డు–హైక్‌ వ్యాఖ్యానించాడు.   

మరిన్ని వార్తలు