యువీతోనే ఆఖరు!

16 Aug, 2019 07:59 IST|Sakshi

న్యూఢిల్లీ: విదేశాల్లో టి20 టోర్నీలు  ఆడేందుకు భారత క్రికెటర్లెవరికీ ఇకపై నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీ)లు ఇవ్వమని క్రికెట్‌ పరిపాలక కమిటీ (సీఓఏ) తెలిపింది. కెనడాలో జరిగిన గ్లోబల్‌ టి20లో ఆడేందుకు భారత మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌కు అనుమతించిన బోర్డు... ఇదే ఆఖరి ఎన్‌ఓసీ అని తేల్చిచెప్పింది. సీఓఏ సభ్యుడొకరు మాట్లాడుతూ ‘యువీకి ఎన్‌ఓసీ ఇచ్చాం. ఇక్కడితోనే సరిపెట్టాలనుకుంటున్నాం. ఇకమీదట ఏ భారత క్రికెటర్‌ విదేశీ లీగ్‌లో ఆడేందుకు ఎన్‌ఓసీ ఇవ్వబోం’ అని అన్నారు. దీనిపై భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారులు విస్మయం ప్రకటించారు.

రిటైర్మెంట్‌ ప్రకటించిన ఆటగాళ్లను ఇక ఏ టోర్నీలోనూ ఆడకుండా చేయడమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బోర్డులో సరైన పాలక వ్యవస్థ లేకపోతే ఇలాంటి అనిశ్చిత నిర్ణయాలే వస్తాయని ఓ అధికారి అన్నారు. మరో అధికారి మాట్లాడుతూ ‘ఒక దేశానికి రిటైర్‌ అయినంత మాత్రాన మొత్తం భౌగోళిక ప్రాంతానికి రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు కాదు. ఒక దేశపు రిటైర్డ్‌ క్రికెటర్లను అనుమతించడమనేది నిర్వాహకుల ఇష్టం. ఇందులో ఏమైన సమస్య  ఉం టే ఐసీసీ చూసుకుంటుంది. కానీ మనమే ఆడించకుండా నిర్ణయం తీసుకోవడం అవివేకం’ అని అన్నారు.  

మరిన్ని వార్తలు