బీసీసీఐ తీరు సరికాదు: గంగూలీ

4 Oct, 2018 10:55 IST|Sakshi

కోల్‌కతా: భారత్-వెస్టిండీస్‌ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా రెండో వన్డే వేదిక మార్పు చర్చనీయాంశమైంది. ముందుస్తు షెడ్యూల్‌ ప్రకారం విండీస్‌తో జరగాల్సిన రెండో్ వన్డేకు ఇండోర్‌ స్టేడియం ఆతిథ్యమివ్వాలి. కానీ, మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు, బీసీసీఐకి నెలకొన్న టికెట్ల వివాదం కారణంగా రెండో వన్డేను విశాఖకు తరలించారు. అయితే దీనిపై మాజీ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (క్యాబ్‌) అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్పందించాడు. ఈ విషయంలో బీసీసీఐ తీరును అతను తప్పుబట్టాడు. బోర్డు తీరు ఇలాగే ఉంటే రాష్ట్ర సంఘాలు మ్యాచ్‌లు నిర్వహించడం కష్టమని అతను అభిప్రాయపడ్డాడు.

‘ఈ వివాదంలో మధ్యప్రదేశ్‌ క్రికెట్‌ సంఘానికే నా పూర్తి మద్దతు. వారి ఇబ్బందులేంటో నాకు తెలుసు. మ్యాచ్‌ల నిర్వహణకు వివిధ ప్రభుత్వ శాఖల సహకారం అవసరం. పోలీసులు చాలా నామమాత్రంగా ఫీజు తీసుకుని రక్షణ కల్పిస్తారు. ఇంకా మరెందరో సాయపడతారు. వాళ్లందరికీ మేం కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాలి. టికెట్లు కొనుక్కోమని వారికి మేం చెప్పలేం. ఇంకా మా సంఘాలకు అనుబంధంగా ఉన్న వాళ్లెందరికో పాస్‌లు ఇవ్వాలి. కాంప్లిమెంటరీల విషయంలో బీసీసీఐ ఏం చేయాలనుకుంటోందో అర్థం కావడం లేదు. మ్యాచ్‌ను తరలించాలనుకుంటే తరలించనివ్వండి. మేమైతే ఈ విషయంలో రాజీపడం.ఇప్పటికే టికెట్లు ప్రింటింగ్‌ ప్రక‍్రియ పూర్తయ్యింది. ఒకవేళ వేదికను మార్చాలనుకుంటే అది వారి ఇష్టం. ఇందులో మేము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ఈడెన్‌లో మ్యాచ్ జరుగుతుందనే ఆశిస్తున్నా' అని గంగూలీ అన్నాడు.

సౌరవ్‌ ఇలా అన్న నేపథ్యంలో నవంబరు 4న కోల్‌కతాలో జరగాల్సిన భారత్‌-విండీస్‌ ల మధ్య జరగాల్సిన తొలి టీ20 విషయంలోనూ సందేహాలు మొదలయ్యాయి.  బీసీసీఐ తాజా నిబంధనల ప్రకారం మొత్తం టికెట్లలో 90 శాతం విక్రయానికి పెట్టాలి.. ఇక 10 శాతం మాత్రమే కాంప్లిమెంటరీ పాస్‌లు ఇవ్వాలి. ఇదే వివాదానికి దారి తీసింది. కాంప్లిమెంటరీ పాస్‌లను 10 శాతంగా పేర్కొనడంతో్ నిర్వహణ సాధ్యం కాదనేది క్రికెట్‌ అసోషియేషన్‌ల వాదన.

24న వైజాగ్‌లో వన్డే 

మరిన్ని వార్తలు