ప్రతీ ఒక్కరూ పుజారాలు కాలేరు సోదరా..!

8 Dec, 2018 10:43 IST|Sakshi

అడిలైడ్‌: ఆసీస్‌తో మొదటి టెస్టులో భాగంగా తొలి ఇన్నింగ్స్‌ సమయంలో యువ ఆటగాడు రిషభ్‌ పంత్‌ భారీ షాట్‌కు ప్రయత్నించినప్పుడు బౌలర్‌ కమిన్స్‌ దగ్గరికొచ్చి ఏదో అనడం కనిపించింది. దీనికి బదులుగా తానేమీ తక్కు వ కాదన్నట్టు రెండోరోజు ఆటలో పంత్‌ కూడా నోటికి పనిచెప్పాడు. 59 పరుగులకు 3వికెట్లు పడిన దశలో ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌ ఖవాజా, హ్యాండ్‌స్కోంబ్‌ జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కాపాడుకుంటున్నారు. అయితే ఈ జోడీ ఏకాగ్రతను చెడగొట్టేందుకు వికెట్ల వెనకాల నుంచి కీపర్‌ పంత్‌ స్లెడ్జింగ్‌కు దిగాడు. ‘ప్రతీ ఒక్కరు పుజారా కాలేరు’ అంటూ భిన్నమైన వ్యూహం అనుసరించాడు. ఇది స్టంప్స్‌ మైక్‌లో వినిపించడంతో రిషభ్‌ స్లెడ్జింగ్‌కు దిగిన విషయం తెలిసింది.

28 పరుగుల భాగస్వామ్యం తర్వాత ఖవాజా ఇచ్చిన క్యాచ్‌ను పంతే పట్టడం విశేషం. ఈ మ్యాచ్‌లో భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 250 పరుగులకు ఆలౌట్‌ కాగా, ఆసీస్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 235 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో చతేశ్వర పుజారా 123 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. క్లిష్టమైన స్థితిలో ఉన్నప్పుడు పుజారా ఆదుకోవడంతో భారత్‌ తేరుకుంది.

మరిన్ని వార్తలు