బుకీలు నన్ను సంప్రదించారు

28 Feb, 2014 01:01 IST|Sakshi
బుకీలు నన్ను సంప్రదించారు

ఈ విషయాన్ని అధికారులకు చెప్పలేదు
 అంగీకరించిన కివీస్ ఆటగాడు
 
 వెల్లింగ్టన్: గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) సందర్భంగా కొంత మంది బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని అధికారులకు వెల్లడించలేకపోయానని న్యూజిలాండ్ ఆటగాడు లూ విన్సెంట్ అంగీకరించాడు. అయితే ఫిక్సింగ్‌కు సంబంధించి తాను ఎలాంటి తప్పు చేయలేదన్నాడు. ఏదేమైనా ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనలను తాను ఉల్లంఘించానని ఒప్పుకున్నాడు.
 
 ‘బుకీలు నన్ను సంప్రదించినా నేను మాత్రం ఫిక్సింగ్‌కు అంగీకరించలేదు. వాళ్లు సంప్రదించడం వెనుక ఉన్న ఆంతర్యం నాకు అర్థం కాలేదు. అందుకే దాని గురించి ఎలాంటి ఆరోపణలు చేయదల్చుకోలేదు. అక్కడ జరిగిన మ్యాచ్‌ల్లోగానీ, ఇటీవల జరిగిన విచారణలోగానీ నేను భాగం పంచుకోలేదు’ అని విన్సెంట్ వెల్లడించాడు. మరోవైపు విన్సెంట్‌కు ఎలాంటి శిక్ష పడుతుందన్న విషయాన్ని వెల్లడించేందుకు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు (ఎన్‌జెడ్‌సీ) ఎగ్జిక్యూటివ్ చీఫ్ డేవిడ్ వైట్ నిరాకరించారు.
 

మరిన్ని వార్తలు