మరో రెండు స్వర్ణాలు...

4 Nov, 2017 00:32 IST|Sakshi

కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో

పసిడి పతకాలు నెగ్గిన ప్రకాశ్, అంకుర్‌ మిట్టల్‌  

గోల్డ్‌కోస్ట్‌ (ఆస్ట్రేలియా): పతకాల వేటలో ఒకరితో మరొకరు పోటీపడుతూ కామన్వెల్త్‌ షూటింగ్‌ చాంపియన్‌షిప్‌లో నాలుగోరోజు భారత షూటర్లు రెండు స్వర్ణాలతో కలిపి మొత్తం ఐదు పతకాలను సొంతం చేసుకున్నారు. పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ ఈవెంట్‌ ఫైనల్లో భారత్‌ క్లీన్‌స్వీప్‌ చేసింది. ప్రకాశ్‌ నంజప్ప స్వర్ణం నెగ్గగా... అమన్‌ప్రీత్‌ సింగ్‌ రజతం, జీతూ రాయ్‌ కాంస్యం సాధించారు. పురుషుల డబుల్‌ ట్రాప్‌ ఈవెంట్‌లో ప్రపంచ నంబర్‌వన్‌ అంకుర్‌ మిట్టల్‌ పసిడి పతకం కైవసం చేసుకోగా... మహిళల డబుల్‌ ట్రాప్‌లో శ్రేయసి సింగ్‌ రజతం గెలిచింది. ఇప్పటివరకు ఈ టోర్నీలో భారత్‌ 15 పతకాలు సాధించం విశేషం.  
పిస్టల్‌ ఈవెంట్‌ క్వాలిఫయింగ్‌లో జీతూ రాయ్‌ 559 పాయింట్లు, అమన్‌ప్రీత్‌ 543 పాయింట్లు, ప్రకాశ్‌ నంజప్ప 542 పాయింట్లు సాధించారు.

ఫైనల్లో ప్రకాశ్‌ 222.4 పాయింట్లతో అగ్రస్థానాన్ని పొందగా... అమన్‌ప్రీత్‌ 222 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. 201.9 పాయింట్లో జీతూ మూడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో అంకుర్‌ మిట్టల్‌ 74 పాయింట్లు స్కోరు చేసి విజేతగా నిలిచాడు. మాథ్యూ ఫ్రెంచ్‌ (బ్రిటన్‌–72 పాయింట్లు) రజతం, నాథన్‌ లీ (మాల్టా–54 పాయింట్లు) కాంస్యం గెలిచారు. మహిళల డబుల్‌ ట్రాప్‌ ఫైనల్లో శ్రేయసి సింగ్‌ 96 పాయింట్లు సాధించి రెండో స్థానాన్ని సంపాదించింది. ఎమ్మా కాక్స్‌ (ఆస్ట్రేలియా–103 పాయింట్లు) పసిడి పతకం... రాచెల్‌ పారిష్‌ (ఇంగ్లండ్‌–93 పాయింట్లు) కాంస్యం నెగ్గారు. 

మరిన్ని వార్తలు