గౌతం గంభీర్‌ వల్లే..

12 Jun, 2018 14:21 IST|Sakshi

బెంగళూరు: అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టుకు టీమిండియా ఆటగాళ్లకు నిర్వహించిన యో యో టెస్టులో సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్ మహమ్మద్‌ షమీ ఫెయిలయ్యాడు. దీంతో బీసీసీఐ స్థానంలో ఢిల్లీ యువ ఫాస్ట్‌ బౌలర్‌ నవ్‌దీప్‌ సైనిని ఎంపిక చేశారు. దీనిపై నవదీప్‌ సైనీ స్పందిస్తూ...‘ఒకప్పుడు పాకెట్‌ మనీ కోసం క్రికెట్‌ ఆడాను. ఎప్పుడైతే నేను గౌతమ్‌ గంభీర్‌ కంటపడ్డానో ఒక్కసారిగా నా కెరీర్‌లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. గౌతి నాకు ఒక సలహా ఇచ్చాడు.

బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేసుకోవద్దన్నాడు.  గతంలో ఎలా బౌలింగ్‌ చేశావో అలాగే చేయాలని సూచించాడు. టెన్నిస్‌ బాల్‌తో క్రికెట్‌ ఆడే నేను ఎరుపురంగు ఎస్‌జీ టెస్టు బాల్‌తో ఆడటానికి గంభీర్‌ ప్రధాన కారణం. గౌతి సలహాతో నేను అలాగే బౌలింగ్‌ కొనసాగించి అద్భుత ఫలితాలు సాధించా. రంజీ ట్రోఫీ కోసం నిర్వహించిన ప్రాక్టీస్‌ సెషన్‌లో గంభీర్‌ 15 నిమిషాల పాటు నా బౌలింగ్‌లో ప్రాక్టీస్‌ చేశాడు. నా బౌలింగ్‌లో ఏదో మాయ ఉందని గ్రహించి దిల్లీ క్రికెట్‌ బోర్డు సభ్యులతో మాట్లాడాడు. రంజీ ట్రోఫీలోఢిల్లీ తరఫున నన్ను ఆడించాలని వాళ్లని కోరాడు. అలా ఢిల్లీ జట్టుకు ఆడాను. కొన్ని మ్యాచ్‌ల తర్వాత ఓ రోజు గౌతి నా వద్దకు వచ్చి నెట్‌ సెషన్స్‌లో బాగా ప్రాక్టీస్‌ చెయ్‌. నువ్వు టీమిండియాకు ఆడతావు అని చెప్పాడు. గౌతి మాటలు నిజమయ్యాయి. కేవలం అతని వల్లే నేను ఈ రోజు ఇక్కడ ఉన్నా. అదేంటో తెలియదు.. గౌతి గురించి ఎప్పుడు, ఎక్కడ మాట్లాడినా భావోద్వేగానికి గురైపోతా’ అని నవదీప్‌ సైని వివరించాడు.
 

>
మరిన్ని వార్తలు