ఉస్మానియా జట్టుకు కాంస్యం

20 Jan, 2018 10:31 IST|Sakshi

ఇంటర్‌ యూనివర్సిటీ టెన్నిస్‌ టోర్నమెంట్‌

సాక్షి, హైదరాబాద్‌: ఆలిండియా ఇంటర్‌ యూనివర్సిటీ మహిళల టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) జట్టు రాణించింది. విశాఖ పట్నంలోని గీతం యూనివర్సిటీలో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై స్వర్ణాన్ని, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ జట్టు రజతాన్ని గెలుచుకున్నాయి. కాంస్య పతక పోరులో ఉస్మానియా జట్టు 2–1తో ఎస్పీ యూనివర్సిటీ (పుణే)పై విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో భాగంగా జరిగిన తొలి సింగిల్స్‌లో దీక్ష అజిత్‌ (ఓయూ) 6–3, 6–2తో ప్రగతి (ఎస్పీయూ)పై గెలుపొందింది. రెండో సింగిల్స్‌లో శ్రావ్య శివాని (ఓయూ) 1–6, 0–6తో స్నేహల్‌ (ఎస్పీయూ) చేతిలో ఓడిపోవడంతో స్కోరు 1–1తో సమమైంది. ఫలితం తేల్చే డబుల్స్‌ మ్యాచ్‌లో దీక్ష– శ్రావ్య (ఓయూ) ద్వయం 3–6, 7–5, 10–5తో ప్రగతి–స్నేహల్‌ (ఎస్పీయూ) జంటపై గెలుపొందడంతో ఓయూకు పతకం ఖాయమైంది. అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో ఓయూ 0–2తో యూనివర్సిటీ ఆఫ్‌ ముంబై చేతిలో ఓడిపోయింది. క్వార్టర్స్‌లో 2–0తో పంజాబ్‌ యూనివర్సిటీపై గెలుపొందింది.  

మరిన్ని వార్తలు