అభినందించిన వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ టెన్నిస్ టోర్నమెంట్లో సత్తా చాటిన ఉస్మానియా మహిళల జట్టును వైస్ చాన్స్లర్ లక్ష్మీకాంత్ రాథోడ్ అభినందించారు. ఆంధ్ర యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో జరిగిన టోర్నీలో శ్రావ్య శివాని, శ్రేయ, సాయి దేదీప్య, అనూష, షరియాలతో కూడిన ఓయూ జట్టు సౌత్జోన్ విజేతగా నిలిచింది. మణిపాల్ యూనివర్సిటీలో జరిగిన మరో టోర్నీలో రెండోస్థానంలో నిలిచి ఆకట్టుకుంది.
ఇదే కాకుండా ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ముగ్గురు ప్లేయర్లు ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్లో పాల్గొననున్నారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వేదికగా నేటి నుంచి 10వ తేదీ వరకు వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ సెలక్షన్ ట్రయల్స్ జరుగుతాయి. ఈ సందర్భంగా ఓయూ వైస్ చాన్స్లర్, ప్రొఫెసర్ రాజేశ్ కుమార్, ప్రొఫెసర్ కె. దీప్లా, సునీల్ కుమార్ ఓయూ జట్టును అభినందించారు. భవిష్యత్తో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు.