‘మా అత్యుత్తమ ప్రదర్శన సరిపోదేమో’

22 Dec, 2019 14:40 IST|Sakshi

టీమిండియాను ఓడించడం కష్టమే..

కటక్‌: టీమిండియాతో చివరి వన్డేలో తాము అత్యుత్తమ ప్రదర్శన చేసినా అది సరిపోవకవచ్చని వెస్టిండీస్‌ కోచ్‌ ఫిల్‌ సిమ్మన్స్‌ అభిప్రాయపడ్డాడు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న టీమిండియాను సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో ఓడించలేకపోవచ్చన్నాడు. ‘ మేము అత్యుత్తమ ప్రదర్శన చేసినా విరాట్‌ కోహ్లి నేతృత్వంలోని భారత్‌ క్రికెట్‌ జట్టును ఓడించడానికి సరిపోవకపోవచ్చు. భారత్‌తో జరిగే చివరి మ్యాచ్‌కు మా జట్టు సభ్యులంతా వంద శాతం ప్రదర్శన ఇవ్వడానికి సమాయత్తమయ్యారు.కానీ అది మేము విజయం సాధించేది అవుతుందని నేను అనుకోవడం  లేదు. మేము అత్యుత్తమ ప్రదర్శన చేసినా టీమిండియాను ఓడించడం చాలా కష్టం.

మేము ప్రస్తుతం ఒక డైరెక్షన్‌లో ముందుకు వెళుతున్నాం. అద్భుతాలు చేయడానికి కృషి చేస్తున్నాం. భారత్‌ ముందు 320 పరుగుల లక్ష్యాన్నిఉంచితే పోరాడవచ్చు. ఈ రోజుల్లో 300 పరుగుల స్కోరు సరిపోదు. అందులోనూ భారత్‌ వంటి పటిష్టమైన జట్టు ముందు మూడొందల స్కోరు తక్కువే’ అని సిమ్మన్స్‌ అన్నాడు. అయితే ఈ సిరీస్‌లో  ఔటైన తమ ఆటగాళ్లకు విరాట్‌ కోహ్లి విన్నూత్నంగా సెండాఫ్‌ ఇవ్వడాన్ని తాము తేలిగ్గా తీసుకున్నామన్నాడు. అది బ్యాట్స్‌మన్‌ ఔటైనప్పుడు సహజంగా జరిగే ప్రక్రియ మాత్రమే  అన్నాడు. అందుకోసం తాము హోటల్‌లో కూర్చొని అందుకు ఎలా పంచ్‌ ఇవ్వాలనే దానిపై కసరత్తు చేయాల్సిన అవసరం లేదని సిమ్మన్స్‌ పేర్కొన్నాడు.

>
మరిన్ని వార్తలు