ఆ క్రెడిట్ అంతా వారిదే: ధావన్

26 Oct, 2017 12:45 IST|Sakshi

పుణె:న్యూజిలాండ్ తో  చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ లో టీమిండియా పూర్తిస్థాయి ప్రదర్శనతో ఆకట్టుకుంది. న్యూజిలాండ్ కు ఏ దశలోనూ అవకాశం ఇవ్వకుండా విజృంభించిన విరాట్ సేన సిరీస్ పై ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. రెండో వన్డేలో విజయానంతరం టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ మాట్లాడుతూ..' తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో మా బౌలర్లు విజృంభించారు. సగం పనిని బౌలర్లు ముందుగానే పూర్తిచేయడంతో సునాయాసంగా విజయం సాధించాం. న్యూజిలాండ్ ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయడంలో బౌలర్లు సక్సెస్ అయ్యారు. దాంతో మా విజయం లాంఛనమే అయ్యింది.

రెండో వన్డేలో విజయం క్రెడిట్ అంతా కచ్చితంగా బౌలర్లదే. సీమ్ కు పెద్దగా అనుకూలించని పిచ్ పై బౌలర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేసి కివీస్ ను కట్టడి చేశారు. ఇక్కడే సగం పని పూర్తయ్యింది. న్యూజిలాండ్ చేసిన 230 పరుగులు చూస్తే ప్రస్తుత పరిస్థితుల్లో కష్టం కాదు. మూడొందల పరుగుల్ని సులువుగా ఛేదించే ఈ రోజుల్లో 230 చాలా తక్కువగానే చెప్పొచ్చు. న్యూజిలాండ్ ను కట్టడి చేయడంలో బౌలర్లు రాణించడం ఒకటైతే, ఫీల్డర్డు ఆకట్టుకోవడం రెండోది' అని ధావన్ విశ్లేషించాడు.

మరిన్ని వార్తలు