పాకిస్తాన్‌దే సిరీస్ నాలుగో వన్డేలో శ్రీలంక చిత్తు

23 Jul, 2015 00:41 IST|Sakshi
పాకిస్తాన్‌దే సిరీస్ నాలుగో వన్డేలో శ్రీలంక చిత్తు

కొలంబో: శ్రీలంకతో టెస్టు సిరీస్ గెలుచుకున్న పాకిస్తాన్ వన్డేల్లోనూ సత్తా చాటింది. తొమ్మిదేళ్ల తర్వాత లంక గడ్డపై వన్డే సిరీస్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఇక్కడ జరిగిన నాలుగో వన్డేలో పాక్ 7 వికెట్ల తేడాతో శ్రీలంకపై ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. తిరిమెన్నె (126 బంతుల్లో 90; 5 ఫోర్లు) సెంచరీ చేజార్చుకోగా, దిల్షాన్ (59 బంతుల్లో 50; 3 ఫోర్లు) రాణించాడు.

పాక్ బౌలర్లలో ఇర్ఫాన్‌కు 3, అన్వర్ అలీకి 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 40.5 ఓవర్లలో 3 వికెట్లకు 257 పరుగులు చేసింది. అహ్మద్ షహజాద్ (90 బంతుల్లో 95; 12 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ హఫీజ్ (88 బంతుల్లో 70; 8 ఫోర్లు, 1 సిక్స్) రెండో వికెట్‌కు 115 పరుగులు జోడించి పాక్ గెలుపులో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ అజహర్ అలీ (28 బంతుల్లో 33; 4 ఫోర్లు)తో పాటు చివర్లో షోయబ్ మాలిక్ (16 బంతుల్లో 29 నాటౌట్; 4 సిక్సర్లు) ధాటిగా ఆడారు. ఈ విజయంతో ఐదు వన్డేల సిరీస్‌ను పాక్ 3-1తో గెలుచుకుంది. చివరిదైన ఐదో వన్డే ఆదివారం హంబన్‌టోటలో జరుగుతుంది.
 
 

మరిన్ని వార్తలు