‘అవకాశం వస్తే మెరుగ్గా బౌలింగ్‌ చేస్తా’

2 Jun, 2020 12:52 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ప్రస్తుత ప్రపంచ క్రికెట్‌లో ఎంతో మంది బౌలర్లకు తన బ్యాటింగ్‌తో నిద్రలేని రాత్రులను మిగిల్చాడు టీమిండియా సారథి, పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి. అతడికి బౌలింగ్‌ చేయాలంటే బౌలర్లు ముఖ్యంగా యువ బౌలర్లు కాస్త తడబాటుకు గురవుతారు. అయితే పాకిస్తాన్‌ నయా బౌలింగ్‌ సంచలనం నసీమ్‌ షా కోహ్లితో పోటీకి సిద్దంగా ఉన్నట్లు తెలిపాడు. తాజాగా స్థానికంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ 17 ఏళ్ల యువ బౌలర్‌ ఆసక్తికర ముచ్చట్లు చెప్పాడు. (కుంబ్లే... కట్టు... వికెట్టు)

‘భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే ఎప్పటికీ ప్రత్యేకమే. అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఈ మ్యాచ్‌ను తిలకిస్తారు. అందుకే భారత్‌-పాక్‌ మ్యాచ్‌తో ఆటగాళ్లు హీరోలు లేక విలన్లు అవ్వొచ్చు. టీమిండియాతో మ్యాచ్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. భీకర బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన భారత్‌ జట్టుతో తలపడేందుకు సిద్దంగా ఉన్నాను. పాక్‌ అభిమానులు ఏ మాత్రం నిరుత్సాహపడని ప్రదర్శన చేస్తాను. పరుగుల యంత్రం విరాట్‌ కోహ్లి అంటే నాకు భయం లేదు కానీ గౌరవ ఉంది. అతడికి బౌలింగ్‌ చేసేందకు ఏ మాత్రం భయపడను, ధైర్యంగా బౌలింగ్‌ చేస్తాను’ అంటూ నసీమ్‌ షా పేర్కొన్నాడు. (వికెట్‌ కీపర్‌గా గిల్‌క్రిస్ట్‌.. ధోనికి నో చాన్స్‌!)

ఇక 16 ఏళ్ల వయసులోనే టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన నసీమ్‌.. బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో హ్యాట్రిక్ వికెట్లతో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. అంతేకాకుండా కరాచీ వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా నసీమ్ రికార్డు నెలకొల్పాడు. 

మరిన్ని వార్తలు