‘మా జట్టుకు ఓటమి భయం పట్టుకుంది’

25 Sep, 2018 13:16 IST|Sakshi

దుబాయ్‌: ప్రస్తుత ఆసియాకప్‌లో టీమిండియాతో తలపడిన రెండు సందర్భాల్లోనూ పాకిస్తాన్‌ను ఘోర పరాజయం వెక్కిరించింది.  దాంతో పాకిస్తాన్‌ కోచ్‌ మికీ ఆర్థర్‌ తమ జట్టు పేలవ ప్రదర్శనపై అసహనం వ్యక్తం చేశాడు. భారత్‌పై పాక్ ఆటతీరు పట్ల పెదవి విరిచిన ఆర్థర్‌.. తమ జట్టు చేసిన చెత్త ప్రదర్శనల్లో ఇదొకటని విమర్శించాడు. ‘మా ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం లోపించింది. మా ఆటగాళ్లకు ఓటమి భయం పట్టుకుంది. క్రికెట్ జట్టుగా మేం ఎక్కడున్నామో చెక్ చేసుకోవాల్సి ఉంది’ అని ఆర్థర్ తెలిపాడు.

‘భారత్‌లో చాలా మంచి ఆటగాళ్లున్నారు. వారికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా భారీ మూల్యం చెల్లించుకోవాలి. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో అదే జరిగింది. బ్యాటింగ్‌లో మా స్ట్రైక్ రేట్ బాగోలేదు, బౌలర్లు త్వరగా వికెట్లు తీయాలి. మాకు అవకాశాలు వచ్చినా సద్వినియోగం చేసుకోలేదు. ఇలాంటి వికెట్‌పై ప్రత్యర్థికి ఛాన్స్ ఇస్తే ఆధిపత్యం చెలాయిస్తారు. మేం వాస్తవికంగా ఆలోచించాలి. అద్భుతమైన భారత జట్టు చేతిలో ఓడాం. మా ఆటగాళ్లు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నట్లు కనబడుతున్నారు’ ఆర్థర్ ఎద్దేవా చేశాడు.

చదవండి: మరీ ఇంత దారుణంగా ఓడిపోతారా?

మరిన్ని వార్తలు