మనసులు గెలిచిన పాక్‌ క్రికెటర్లు

25 Nov, 2019 19:56 IST|Sakshi
ఆస్ట్రేలియాతో మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్‌ ఆటగాళ్లు

బ్రిస్బేన్‌: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్‌లో పాకిస్తాన్‌ ఓటమిపాలైంది. అయితే పాకిస్తాన్‌ టీమ్‌లోని కొందరు భారత ట్యాక్సీ డ్రైవర్‌ పట్ల తమ సహృదయతను చాటుకుని ప్రేక్షకుల మన్నన చూరగొన్నారు. ఈ ఘటన గురించి ప్రముఖ కామెంటేటర్‌ ఆలిసన్‌ మిచెల్‌ రేడియో ప్రత్యక్ష ప్రసారంలో వెల్లడించారు. ఆసీస్‌ మాజీ ఫాస్ట్‌ బౌలర్‌ మిచెల్‌ జాన్స్‌న్‌కు ఈ ఆసక్తికర సంఘటన గురించి తెలిపారు.

‘యాసిర్‌ షా, షహీన్‌ ఆఫ్రిది, నసీమ్‌ షా సహా ఐదుగురు పాకిస్తాన్‌ క్రికెటర్లు ఇండియన్‌ రెస్టరెంట్‌కు వెళ్లాలనుకున్నారు. భారత ట్యాక్సీ ఒకరు ఈ ఐదుగురిని ఇండియన్‌ రెస్టరెంట్‌కు తీసుకెళ్లాడు. ట్యాక్సీ దిగిన తర్వాత డబ్బులు ఇవ్వగా డ్రైవర్‌ సున్నితంగా తిరస్కరించాడు. తమ పట్ల భారత ట్యాక్సీ​ డ్రైవర్‌ చూపిన ఆదరాభిమానులకు ముగ్దులైన పాక్‌ క్రికెటర్లు అతడిని తమతో పాటు భోజనానికి పిలిచారు. పాకిస్తాన్‌ ఆటగాళ్ల పక్కన కూర్చుని ఆనందంగా విందు ఆరగిస్తున్న ఫొటోలను తన ఫోన్‌లో ట్యాక్సీ డ్రైవర్‌ తనకు చూపించాడ’ని ఆలిసన్‌ మిచెల్‌ వెల్లడించారు. ఈ వీడియో వెంటనే సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మానవీయ కథనం చాలా బాగుంది అంటూ నెటిజనులు కామెంట్లు పెట్టారు. గ్రేట్‌ స్టోరీ అంటూ కొంతమంది ప్రశంసించారు.

మరిన్ని వార్తలు