పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప ఆడలేరు: పాక్‌ ఫ్యాన్స్‌

17 Jun, 2019 11:42 IST|Sakshi

పరాజయం తట్టుకోలేక ఏడ్చేసిన పాక్‌ అభిమాని

మాంచెస్టర్‌ : ప్రపంచకప్‌లో భారత్‌ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ పాక్‌ను ఏడోసారి చిత్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠతను రేపిన పోరులో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ శతకం, కోహ్లి, రాహుల్‌ అర్థశతకం.. బౌలర్లు కుల్దీప్‌ యాదవ్‌, హార్దిక్‌ పాండ్యా, విజయ్‌ శంకర్‌లు భారత్‌కు విజయాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ గెలుపుతో ఓ వైపు భారత అభిమానులు పండగ చేసుకుంటుండగా.. పాక్‌ అభిమానులు మాత్రం తమ జట్టు పేలవ ప్రదర్శనను విమర్శిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ పాక్‌ అభిమాని రియాక్షన్‌ ట్విటర్‌లో తెగ ట్రెండ్‌ అవుతోంది.

సదరు అభిమాని ఓ విలేకరితో మాట్లాడుతూ.. ‘భారత్‌ విజృంభించడం చూశాక వర్షం వచ్చి మ్యాచ్‌ ఆగిపోవాలని కోరుకున్నాం. కానీ వరుణ దేవుడు కూడా మాపై దయ చూపలేదు.  మా టీం తిండి తినడం మీద చూపే శ్రద్ధలో పావు వంతు అయినా ఫిట్‌నెస్‌, క్రమశిక్షణ మీద చూపిస్తే బాగుండేది. పిజ్జాలు బర్గర్లు తింటారు తప్ప మైదానంలో పోరాడలేరు. రేపు మ్యాచ్‌ ఉందంటే.. మా వాళ్లు తమ ఫిట్‌నెస్‌ గురించి ఏ మాత్రం ఆలోచించకుండా.. జంక్‌ ఫుడ్‌ తిని కడుపు నింపుకోవడంలో బిజీగా ఉంటారు’ అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తి అతని భుజం తడుతూ.. ఓదర్చగా మరో వ్యక్తి తమ జాతీయ జెండాతో ఆ అభిమాని కన్నీళ్లు తుడిచాడు. ప్రస్తుతం ఈ వీడియో ట్విటర్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది.
 

మరిన్ని వార్తలు