అది ఒక చెత్త ఆలోచన : పాక్‌ మాజీ కెప్టెన్‌

25 Dec, 2019 14:08 IST|Sakshi

న్యూఢిల్లి: బీసీసీఐ అధ్యక్షుడు సౌర‌వ్‌ గంగూలీ ఇటివల నాలుగు దేశాలు( భారత్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా, మరో అగ్రశేణి క్రికెట్‌ జట్టు)తో కూడిన క్రికెట్‌ సూపర్‌ సీరిస్‌ నిర్వహించాలని ప్రతిపాదన తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీనిపై తాజాగా పాకిస్తాన్‌ మాజీ కెప్టెన్‌ రషీద్‌ లతీఫ్‌ ఓ యూట్యూబ్‌ వీడియోలో విమర్శించారు. సౌరవ్‌ గంగూలీ ప్రతిపాదించిన నాలుగు జట్లతో కూడిన టోర్నమెంట్‌ శుభవార్త కాదన్నారు. ప్రత్యేకంగా నాలుగు దేశాల క్రికెట్‌ జట్లతో సిరీస్‌లు నిర్వహించటం వల్ల మిగతా ఐసీసీ సభ్యదేశాలను ఈ దేశాలు విస్మరించనట్లు అవుతుందని రషీద్‌ ఘాటుగా విమర్శించారు. గతంలో తీసుకువచ్చిన బిగ్‌ త్రి అనేది ఒక చెత్త ఆలోచనగా మిగిలిపోతుందని రషీద్‌ అభిప్రాయపడ్డాడు.

2021లో ప్రారంభమయ్యే నాలుగు దేశాల సూపర్‌ సిరీస్‌ మొదటగా భారతదేశంలో జరగనున్నట్లు సౌరభ్‌ గంగూలి పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక నాలుగు దేశాల టోర్నీపై భారత్‌, ఇంగ్లాండ్‌ దేశ క్రికెట్‌ జట్లు సిద్ధంగా ఉన్నా.. ఆస్ట్రేలియా క్రికెట్‌ బోర్డు మాత్రం తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. అదే విధంగా ఐసీసీ మూడు దేశాలకు మించి ఎటువంటి సిరీస్‌లు నిర్వహించదన్న విషయం తెలిసిందే. కాగా దీనిపై స్పందించిన ఇంగ్లాండ్‌ క్రికెట్‌ బోర్డు.. ‘మేము ప్రధాన క్రికెట్‌ దేశాల అధికారులతో క్రమం తప్పకుండా కలుస్తాము. క్రికెట్‌కు సంబంధించిన పలు విషయాలపై చర్చిస్తాము. డిసెంబర్‌లో జరిగిన బీసీసీఐ సమావేశంలో నాలుగు దేశాల టోర్నీ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ టోర్నీపై ఇతర ఐసీసీ సభ్యదేశాలతో చర్చిండానికి సిద్ధంగా ఉన్నాము’ అని తెలిపింది. 

మరిన్ని వార్తలు